ఏపీలో అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. మంత్రి కుమారుడు అవినీతిలో ఇరుక్కున్నాడని, ఇందులో భాగంగానే లంచంగా కారును తీసుకున్నాడని ప్రతిపక్ష పార్టీల నేతలు ఆరోపిస్తున్నారు. అయితే ఇందుకు ధీటుగా మంత్రి స్పందించారు.
ఏపీ కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం కుమారుడు ఈశ్వర్పై మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఏసీబీ కాల్ సెంటర్కు కాల్ చేసి ఫిర్యాదు చేశాడు. మంత్రి కుమారుడు ఓ కేసులో ఏ14 నిందితుడిగా ఉన్న వ్యక్తి నుంచి బెంజి కారును లంచంగా తీసుకున్నాడన ఆరోపించారు. ప్రభుత్వం వెంటనే మంత్రి వర్గం నుంచి మంత్రిని తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. దీంతో ఒక్కసారిగా రాష్ట్రంలో దుమారం రేగింది.
దీనిపై వెంటనే కార్మికశాఖ మంత్రి గుమ్మనూరు జయరాం స్పందించారు. తన కుమారుడు ఈశ్వర్కు రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో మంది అభిమానులు ఉంటారన్నారు. ఎంతో మందికి బహుమతులు ఇస్తుంటారని చెప్పుకొచ్చారు. బెంజ్ కారుకు తమకు ఎలాంటి సంబంధం లేదన్నారు. తన కుమారుడి పేరుమీద బెంజ్ కారు ఉన్నట్లు నిరూపిస్తే రాజీనామా చేసేందుకు సిద్ధమని ఆయన సవాల్ విసిరారు. మరి మంత్రి కుమారుడిపై ఆరోపణలు చేసిన టిడిపి నేతలు దీన్ని నిరూపించేందుకు సవాల్ స్వీకరిస్తారో లేదో చూడాలి.