కరోనాతో ఇబ్బందులు పడుతున్న వేళ విశాఖలో కొత్త వ్యాధి వచ్చిందన్నవార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో కరోనా విజృంభిస్తుంటే విశాఖ మన్యంలో ఐదుగురు చనిపోవడంతో చర్చనీయాంశమైంది.
విశాఖ ఏజెన్సీ ప్రాంతాలైన రొంపల్లి, చినబార గ్రామాల్లో ఐదుగురు చనిపోయారు. ఈ విషయం బయటకు రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. వెంటనే ఏజెన్సీ ప్రాంతానికి వెళ్లి పరీక్షలు నిర్వహిస్తున్నారు. చనిపోయిన వారంతా జ్వరం, కడుపునొప్పి, కాళ్లు, చేతులు వాపులతోనే చనిపోయారు. దీంతో ప్రజలంతా ఆందోళనకు గురయ్యారు. అయితే వీరి మృతికి కారణం మాత్రం వీరి ఆహారపు అలవాట్లేనన్న ప్రాథమిక నిర్ధారణకు వైద్యులు వచ్చారు.
దీంతో మిగిలిన వారికి కూడా ఏమైనా ఈ తరహా లక్షణాలు ఉన్నాయా అన్న కోణంలో ఆరా తీస్తున్నారు. ఈ నేపథ్యంలో దాదాపు 20 మంది ఈ లక్షణాలు ఉన్న వారికి కరోనా పరీక్షలు చేయగా నెగిటివ్ అని నిర్ధారణ అయ్యింది. అయితే మరి ఇప్పుడు మృతి చెందిన వారంతా సీజనల్ వ్యాధుల కారణంగానే చనిపోతున్నారా అన్న దానిపై వైద్యులు ఆలోచిస్తున్నారు. ఎందుకంటే ఏజెన్సీలో ఉండే వాతావరణంతో పాటు ప్రజల ఆహారపు అలవాట్లు కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఇప్పుడు కురుస్తున్న వర్షాలకు వాతావరణం చల్లబడటంతో పాటు కలుషితమైన నీరు త్రాగడం కూడా సీజనల్ వ్యాధులకు కారణం.
దీని వల్లనే ఈ మృతులు సంభవించాయా అన్న కోణంలో అంచనాకు వస్తున్నారు. పైగా నిల్వ ఉంచిన మాంసం తింటే కూడా వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది. పట్టణాల్లో అధికారులు దాడులు చేసి చికెన్ నిల్వ ఉంచి అమ్మితేనే చర్యలు తీసుకుంటారు. అలాంటిది ఏజెన్సీల్లో ప్రజలు మాంసం విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారో ఆలోచించాల్సిన అవసరం ఉంది. అధికారులు, ప్రజా ప్రతినిధులు జాయింట్గా వెళ్లి అవగాహన కల్పిస్తే తప్ప ఏజెన్సీ ప్రాంతంలో పరిస్థితుల్లో మార్పులు రావు.