తెలుగుదేశం పార్టీలో సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు చేసిన కామెంట్స్ ఇప్పుడు తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలో చర్చనీయాంశమయయ్యాయి. పార్టీ అధినేత వ్యవహార శైలే ఇందుకు కారణంగా గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఇంతకీ ఏం జరిగిందంటే గత కొద్ది రోజులుగా చంద్రబాబునాయుడు హైదరాబాద్కే పరిమితం అయ్యారు. కరోనా కేసులు ఎక్కువైనప్పటి నుంచి ఆయన ప్రత్యక్ష్యంగా కాకుండా జూమ్ ద్వారానే ప్రజలకు సందేశాన్ని పంపుతున్నారు. ఇదే ఇప్పుడు అయ్యన్నపాత్రుడిని ఆగ్రహానికి గురయ్యేలా చేసింది. ఈ విషయంపై ఆయన చంద్రబాబుతోనే తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారని తెలుస్తోంది. పార్టీ కార్యాలయాలకు తాళాలు వేసి వెళ్లిపోతే ఎలా అని ఆయన బాబుతో అన్నారని టాక్.
పార్టీ ఆఫీసుకు రాకుండా ఉంటే ప్రజలు ఏమనుకుంటారు, పార్టీ కార్యకర్తలకు ఎలాంటి సందేశం ఇస్తున్నామని ఆయన ప్రశ్నించారని తెలుస్తోంది. ఇలాగే జరిగితే టిడిపిని ఎవరు బ్రతికిస్తారని అయ్యన్న ఆగ్రహంగానే మాట్లాడారని సమాచారం. ఇదే ఇప్పుడు తెలుగుదేశంలో చర్చకు దారితీసింది. పార్టీలో దాదాపుగా చాలా మంది అభిప్రాయం ఇప్పుడు ఇదే. కరోనా వచ్చినప్పటి నుంచి పార్టీ అధ్యక్షుడు కేవలం హైదరాబాద్కే పరిమితం కావడం నేతలకు నచ్చడం లేదని తెలుస్తోంది.
అయితే అయ్యన్నపాత్రుడు చంద్రబాబుతో ఇలా మాట్లాడటం ఇప్పుడేమీ కొత్త కాదు. గతంలో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు పార్టీలోకి తీసుకున్న సమయంలో, ఎన్నికల్లో తెలంగాణలో టిడిపి పొత్తు పెట్టుకున్నప్పుడు కూడా ఆయన ప్రశ్నించారు. మరి ఇప్పటినుంచైనా చంద్రబాబు ప్రత్యక్ష్యంగా ప్రజల్లోకి వస్తారో లేదా జూమ్లకే పరిమితమవుతారో చూడాలి.