కంటి చూపు మందగించడంపై అపోహాలు తొలగించడం ఎలా 

సర్వేంద్రియాణాం – నయనం ప్రధానం అన్నారు. అందుకే కంటిచూపు గురించి ప్రచారంలో ఉన్న కొన్ని అపోహలు తెలుసుకుందాం.
చంటిపిల్లలకు స్నానానికి ముందు నూనెమర్దన చేసేటప్పుడు పూర్వం (?) అమ్మమ్మలు ముక్కును (రెండుకళ్ల మధ్యనున్న భాగాన్ని) వత్తుతూ ముక్కు పొడవుగా ఉండటానికి అలా వత్తుతున్నాం అనేవారు. కాని నిజానికది కన్నీళ్లు కంట్లోంచి ముక్కులోకి పోయే నాళాన్ని (Lacrimal duct) వత్తడం జరుగుతుంది. అలా వత్తడంవల్ల ఆ నాళం మూసుకుపోయే అవకాశం ఉండదు.
ఒకవేళ ఆ నాళం మూసుకుపోతే ఆ కంటినుండి నీళ్ళు ఊరకే కారడం జరుగుతుంది (వట్టిగా ఏడుస్తున్నట్టే) కాని ఈ రోజుల్లో నూనెమర్దనా ఎవరు చేస్తున్నారు? అయినా సరే తల్లులూ రోజుకొకటి రెండుసార్లయినా మీ పిల్లలకు ఇలా ముక్కు వత్తడం మర్చిపోకండి. నాన్నకయినా చెప్పి చేయించండి. మెల్లకన్ను ఉన్న పిల్లలు ఒక రకమైన ఆత్మన్యూనతా భావానికి లోనవుతుంటారు. అలాంటి భావం కలగకూడనో ఏమో – మెల్లకన్ను అదృష్టం. అత్తగారింట్లో భాగ్యం పొర్లి పారుతుంది – అని పెద్దవాళ్ళు సరిపెట్టుకుంటూ ఉంటారు. అలా కాకుండా కొంచెం శ్రద్ధ వహిస్తే మెల్లకన్నును నివారించవచ్చు. సాధారణంగా పసిపిల్లలు ఒక సం. వయసు వచ్చేవరకు మెల్లకన్నుతో ఉంటారు. అది నార్మల్‌. మెదడు ఎదుగటం, పరిపక్వత చెందటం సంవత్సరం వరకూ జరుగుతూ ఉంటుంది. ఈ సమయంలో కంటి కండరాలపై కంట్రోల్‌ ఉండదు.
అందువల్ల సం. లోపు వయసు పిల్లలు మెల్లకన్ను కలిగి ఉండొచ్చు. సంవత్సరం దాటాక కూడ మెల్ల ఉన్నట్టుగా అనిపిస్తే వెంటనే తల్లిదండ్రులు ఆ బిడ్డను కంటిడాక్టరుకు చూపించాలి. ఎందుకంటే ఈ లోపం బిడ్డకు 5-7 సం. లోపులోనే సరిచేయాలి. ఆపైన మెల్లను తగ్గించడం కష్టం. ఈ మెల్ల రావడానికి కారణం రెండు కళ్ల యొక్క చూపులో తేడా ఉండటం. అంటే ఒక కన్ను మరీ ఏమీ చూడలేదు. దాని కంటిచూపు వీక్‌ అన్నమాట. అంటే అది హ్రస్వదృష్టి కావచ్చు, లేక దీర్ఘదృష్టి కావచ్చు. చూపు బలహీనంగా ఉన్న కన్ను నెమ్మదిగా అసలు చూడ్డమే మానేస్తుంది (గా తయారవుతుంది) ఏదో ఒకవైపుకి (ముక్కువైపుకో, చెవివైపుకో) తిరిగిపోతుంది. దీన్నే మెల్ల అంటారు. సరయిన సమయంలో (5 సం.లోపు వయసులోనే) సరయిన కంటిఅద్దాలు పెట్టడంవల్ల బాగా ఉన్న కంటిని మూసేసి చెయ్యడంలాటి ప్రక్రియలలో మెల్లను నివారించవచ్చు. దయచేసి అశ్రద్ధ చెయ్యద్దు.
చాలామంది, ముఖ్యంగా స్త్రీలు తలనొప్పి వస్తుందని, మెడనరాలు గుంజుతున్నాయని కంటి డాక్టరు దగ్గరకు వస్తుంటారు. దీన్ని కంటిడాక్టర్లు, కళ్ళద్దాల షాపులవాళ్ళు తమ వ్యాపారానికి ఉపయోగించుకుంటున్నారు. (+)(-) 0,25 అద్దాలు రాసిచ్చి ప్రజల్ని మోసం చేస్తున్నారు. అసలు తలనొప్పికి కారణం కనుక్కోవడమే పెద్ద తలనొప్పి. బి.పి. ఎక్కువున్నా, తక్కువున్నా, జ్వరం వచ్చినప్పుడూ, సమయానికి భోజనం చేయకపోయినా, సైనస్‌ సమస్య ఉన్నా చివరికి ఏదైనా మానసిక వత్తిడి ఉన్న, తలనొప్పి వస్తుంది. ముఖ్యంగా స్త్రీలలో అయితే తలనొప్పికి కారణం రక్తహీనత. (అనేమియా) మరి తలనొప్పి ఇన్ని కారణాలున్నప్పుడు దాన్ని కళ్లద్దాలే తగ్గిస్తాయని అనుకోడం అపోహ కాదా? కాబట్టి మన తలనొప్పికి కారణాన్ని వెదికిపట్టుకొని దానికి వైద్యం చేయించుకోడం మంచిది. అనవసరంగా కళ్ళద్దాలకి డబ్బులు పెట్టకండి.
35-45 సం.రాల వయస్సున్న స్త్రీలు కళ్లడాక్టరు దగ్గరకొచ్చి నాకు ఈ మధ్యే గర్భసంచి తీసేసారు. అప్పట్నుంచి కళ్లు కనబడటం లేదు అనో లేక ఈ మధ్య అమ్మ చనిపోయిందని, అప్పుడు బాగ ఏడ్వడం వల్ల కంటిచూపు తగ్గిపోయిందని చెప్తూ ఉంటారు. నిజానికి గర్భసంచి తీసేయడానికి కంటిచూపుకి ఏం సంబంధం లేదు. ఏడుపుకి కంటిచూపు తగ్గడానికి కూడ ఏం సంబంధం లేదు. కేవలం వయసు ప్రధాన కారణం. ఇదే వయసులోని మగాళ్లకు కూడ చూపు తగ్గుతుంది. ఆడవాళ్లయితే సూదిలో దారం ఎక్కడం లేదు, బియ్యంలో రాళ్లు కనబడ్డం లేదు అంటూ ఉంటారు. చదువుకున్న ఆడవాళ్లు, మగవాళ్లు అయితే అక్షరాలు చదవడం కష్టంగా ఉంది అంటారు. దీనికంతటికీ కారణం – చత్వారం. ఇది 35 సం. దాటిన తర్వాతే వస్తుంది. మన కంటిలో ఒక కటకం (Lens) ఉంది. దానికి వ్యాకోచించే-సంకోచించే స్వభావం ఉంటుంది. దీనివల్ల దగ్గర వస్తువులు, అక్షరాలు చూడ్డంలో ఇబ్బంది ఉండదు. 35 సం. వయసు దాటాక మన కంట్లోని కటకం పై స్వభావాన్ని కోల్పోతుంది. అందువల్ల చత్వారం వస్తుంది. దీనికి పరీక్ష చేయించుకుని సరయిన అద్దాలు వాడటమే పరిష్కారం. మందులవల్ల లాభం లేదు.
ఇకపోతే కాస్త వయసుపైబడినవారిలో శుక్లాలు వస్తాయి. వీటికి చాలారకాల పేర్లున్నాయి. మోతిబిందెలు, కంట్లో పొరలు ఇంగ్లీషులో కాటరాక్ట్‌ అంటారు. శుక్లాలు ముదిరినప్పుడు మన కంట్లోని కటకం పాలమాదిరి లేక ముత్యంలాగా తెల్లగా కనిపిస్తుంది. మొదట్లో కంటిఅద్దాలు వాడితే సరిపోతుంది. కాని శుక్లాలు ముదిరిన తర్వాత అద్దాలు పనిచెయ్యవు. ఆపరేషనే మార్గం. రెండుకళ్లలో శుక్లాలు ముదిరిపోతే ఆ పెద్దమనిషి పూర్తిగుడ్డివాడవుతాడు. ఏ పనికయినా మరో మనిషి సాయం కావలసి వస్తుంది. ఈ పరుగుల యుగంలో ఓ ముసలాయిన్ని పట్టించుకునే టైం పెట్టేదెవరు. కనుక ఆపరేషన్‌ చేయిస్తే ఆ పెద్దమనిషి కనీసం తన పనులు తాను చేసుకునే పరిస్థితిని కల్పించిన వాళ్లమవుతాం. ఈ ఆపరేషన్‌ ప్రభుత్వాసుపత్రుల్లో, కొన్ని స్వచ్చంద సంస్థ ల్లో ఫీజు లేకుండా ఉచితంగానే చేస్తారు. కాబట్టి మనవలూ – మనవరాళ్లూ మీ ఇంట్లో తాతయ్యా-అమ్మమ్మలకు, నానమ్మలకు కళ్లల్లో ముత్యాలు కనబడుతుంటే వెంటనే కంటిడాక్టరుకి చూపించండి. ఆపరేషన్‌ చేయిస్తే వాళ్ళు కోల్పోయిన చూపుని మళ్ళీ పొంది మీతో పాటు ఈ ప్రపంచం అందాల్ని ఆస్వాదించకలుగుతారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here