ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ వల్ల ఓ వైపు వేలాది మంది ప్రజలు ప్రాణాలు కోల్పోతున్న విషయం తెలిసిందే. అయితే ఈ భారీ విపత్తు నుంచి ప్రజలను కాపాడేందుకు శాస్త్రవేత్తలు కొన్ని నెలలుగా వ్యాక్సిన్ కనిపెట్టేందుకు ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు. కరోనా వ్యాక్సిన్ ప్రయోగాలపై తాజాగా హ్యాకర్లు దాడులు చేశారన్న విషయం వెలుగులోకి వచ్చింది.
కరోనా వైరస్కు వ్యాక్సిన్ కనిపెట్టేందుకు భారత్తో సహా పలు దేశాలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. కచ్చితమైన వ్యాక్సిన్ను కనిపెట్టేందుకు ఇండియా పక్కా ప్రణాళికతో ముందుకు వెళుతోంది. ఇండియాతో పాటు కెనడా, దక్షిణ కొరియా, అమెరికా వంటి దేశాల్లో ప్రయోగాలు జరుగుతున్నాయి. దీంతో ఈ ప్రయోగాల చోరీని దొంగిలించేందుకు హ్యాకర్లు ప్రయత్నించారు. ఫార్మా కంపెనీలు, వ్యాక్సిన్ పరిశోధకుల లాగిన్ వివరాలను చోరీ చేసేందుకు ప్రయత్నించారు.
రష్యా, ఉత్తర కొరియా దేశాలకు చెందిన హ్యాకర్లు కరోనా వ్యాక్సిన్కు సంబంధించిన డేటాను చోరీ చేసేందుకు ప్రయత్నించారు. ఈ వివరాలను మైక్రోసాఫ్ట్ తెలియజేసింది. డేటా చోరీ చేసేందుకు ప్రయత్నించిన వీళ్లు విఫలమైనట్లు మైక్రోసాఫ్ట్ పేర్కొంది. రష్యా మిలటరీ ఏజెంట్స్కు చెందిన ఫ్యాన్సీ బీర్, ఉత్తర కొరియాకు చెందిన లజారస్ గ్రూప్లు హ్యాకింగ్కు పాల్పడినట్లు తెలిపింది. అయితే ఎంత మంది హ్యాకర్లు డేటా చోరీకి పాల్పడ్డారో అన్న సమాచారం తమ వద్ద లేదని తెలిపింది.