ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు ఆసక్తిగా ఉన్నాయి. ఇప్పుడు స్వామీజీల చుట్టూ రాజకీయాలు తిరుగుతున్నాయి. అసలేం జరిగిందంటే.. ఈ నెల 18న శారదాపీఠం స్వామీజి స్వరూపానంద పుట్టిన రోజు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా 23దేవాలయాల నుంచి ఆలయ మర్యాదలు, కానుకలు పంపాలని దేవాదాయశాఖ ఆదేశాలు జారీ చేసింది.
ఈ ఆదేశాలు ఏపీలో తీవ్ర దుమారం రేపుతున్నాయి. దేవాలయాలు, స్వామీజీల పట్ల రాష్ట్ర ప్రభుత్వం పాటించే సాంప్రదాయాలకు ఈ ఆదేశాలు వ్యతిరేకమని టిడిపి నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు మండిపడ్డారు. స్వామి భక్తుడిగా సీఎం మారి యావత్ అధికార యంత్రాంగాన్ని ఒక ప్రైవేటు పీఠం ముందు మోకరిల్ల చేయడాన్ని ఖండిస్తున్నానన్నారు. సీఎం జగన్ శారదా పీఠానికో, స్వరూపానందకో భక్తుడు కావొచ్చని అయితే తనకు నచ్చిన స్వామి కోసమో, తనకు ఇష్టమైన పీఠం కోసమో అధికార దుర్వినియోగం చేయడానికి ముఖ్యమంత్రి పదవి కాదన్నారు.
సీఎం జగన్ అధికార దుర్వినియోగానికి పరాకాష్ట అన్నారు. చిన జియ్యర్ స్వామికి, కంచి కామకోటి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి, ఇతర స్వామీజీల పుట్టిన రోజులకు లేని ఆలయ మర్యాదలు స్వరూపానందకు ఇవ్వడం ఇతర స్వామీజిలను, పీఠాలను కించపర్చడమే అని అన్నారు. మరి ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి రిప్లై ఇస్తుందో చూడాలి. ఎందుకంటే ఇంత వరకు వివిధ అభివృద్ధి విషయాలపై రాష్ట్ర ప్రభుత్వానికి, ప్రతిపక్ష పార్టీలకు మధ్య మాటల యుద్ధం జరిగింది. ఇప్పుడు స్వామీజీల విషయంలో వివాదం అవుతోంది. ఇది ఎంతవరకు వెళుతుందో మరి.