బీజేపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాల రావు కరోనాతో చనిపోయారు. ఐదు రోజులుగా వెంటిలేటర్పై ఉన్న ఆయన కరోనాతో పోరాడుతూ నేడు మృత్యువాత పడ్డారు.
1961 నవంబర్ 1వ తేదీన తాడేపల్లిగూడెంలో మాణిక్యాల రావు జన్మించారు. 2014లో టిడిపి, బీజేపీ కూటమి తరుపున తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. అనంతరం రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రిగా పనిచేశారు. ఈయనకు భార్య సూర్యకుమారి, కుమార్తె సింధు ఉన్నారు.
మాణిక్యాలరావు చిన్నప్పటి నుంచి ఆర్ఎస్ఎస్లోనే పనిచేశారు. ఆ తర్వాత బీజేపీ ఆవిర్భావం నుంచి పార్టీలోనే కొనసాగుతున్నారు. మొదట ఫోటో గ్రాఫర్గా తన జీవితాన్ని ప్రారంభించారు. స్టూడియో మూసివేసి అనంతరం షూమార్ట్ పెట్టుకున్నారు. 2011 నుంచి 2013 వరకు మానవతా సంస్థ తాడేపల్లిగూడెం పట్టణ అధ్యక్షునిగా పనిచేశారు.
అయితే కొద్ది రోజుల క్రితం తనకు కరోనా సోకిందని మాణిక్యాలరావు ఓ వీడియోను రిలీజ్ చేశారు. అందరూ తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ముందుగా ఏలూరులోని కోవిడ్ ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకున్నారు. మెరుగైన వైద్యం కోసం ఇటీవలె విజయవాడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి ఆయన్ను తరలించారు. శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బంది పడ్డ ఆయన వెంటిలేటర్పై తుది శ్వాస విడిచారు. ఈయన మృతిపట్ల బీజేపీ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేసింది.