ఆంధ్రప్రదేశ్లో జగనన్న పచ్చతోరణం కార్యక్రమం అట్టహాసంగా ప్రారంభమైంది. కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలో సీఎం వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి మొదటి మొక్క నాటి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ ప్రాంతంలో ఒక ఎకరా మూడు కోట్ల రూపాయలు విలువ ఉన్నా 1600 మంది పేదలకు లే అవుట్లు ఇవ్వడం జరిగిందన్నారు. ఇలాంటి ప్రాంతంలో చెట్లు నాటడం సంతోషమన్నారు. పేదల భూముల విషయంలో కూడా తెలుగుదేశం పార్టీ కేసులు వేస్తోందన్నారు. పేదల ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు సుప్రీం కోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం వెళ్లాల్సిన దౌర్బాగ్య పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయన్నారు.
ఆగష్టు 15న 30 లక్షల మంది పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు ఇవ్వగలుగుతామని ఆశిస్తున్నట్లు చెప్పారు. అర్హులై ఉండి పట్టా రాకపోతే దరఖాస్తు చేసుకున్న 90 రోజుల్లోనే పట్టా ఇప్పిస్తామన్నారు. నేడు 20 కోట్ల మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. చెట్లుంటేనే ప్రకృతి బాగుంటుందని వేరే చెప్పాల్సిన అవసరం లేదన్నారు. కార్యక్రమంలో భాగంగా జగన్ అందరితో ప్రతిజ్ఞ చేపించారు.