విశాఖలో కలుద్దాం అంటున్నారు “సీఎం”..!

ఏపీ అసెంబ్లీలో మూడు రాజధానుల బిల్లు ప్రవేశపెట్టినప్పటినుంచి జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో సామాన్యుడికి కొన్ని డౌట్స్ ఉండిపోయాయి! నేడు అమరావతి కోసం ధర్మాలు, దీక్షలూ చేస్తున్నారు అని చెబుతున్న ప్రతిపక్ష పార్టీలు అమరావతిలోనే రాజధాని ఉండాలని ఎందుకు మొంకిపట్టు పడుతున్నారు. రాష్ట్రంలో ఇంక ఎలాంటి సమస్యలూ లేవన్నట్లు.. ఉదయం లేచినప్పటినుంచి కేవలం అమరవాతిపై మాత్రమే ఎందుకు మాట్లాడుతున్నారు. వారికి అమరావతిపై ఉన్న ప్రత్యేక ప్రేమేమిటి.. విశాఖపై ఉన్న ద్వేషమేమిటి? ఇవన్నీ “సీఎం” (కామన్ మ్యాన్) డౌట్లు!

ఆంధ్రప్రదేశ్ మ్యాప్ లో చిటారు కొమ్మమీద మిఠాయి పొట్లంలా కనిపించే విశాఖపట్నం రాజధాని అంటే చాలా మందికి మింగుడు పడలేదు. మరికొందరైతే ఏకంగా క్రైం స్టోరీలు అల్లేస్తుండగా.. మరికొందరైతే ఆ ప్రాంతం నివాసయోగ్యం కాదన్న రేంజ్ లో ప్రసంగాలు చేసేస్తున్నారు! అమరావతిపై ప్రేమ అలాంటిది అంటారా..? అంతలేదిక్కడ… హైదరాబాద్ ని ఖాళీ చేసి వచ్చేస్తున్నప్పుడు బాబు చెప్పిన మాటలు ఈ సందర్భంగా అందరూ గుర్తుంచుకోవాలి! “మనకంటూ ఒక రాజధాని ఉండాలి.. మనం రాజధానిలోనే ఉండాలి..” అని! మరి ప్రస్తుతం బాబు ఎక్కడ ఉన్నారు?

ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే… మూడు రాజధానులు ఎందుకు అని ప్రశ్నిస్తున్న బాబు… ఇప్పటికే రెండు రాజధానులు ఉన్నయని భావిస్తున్నారా అనేది “సీఎం” అనుమానం! ఎందుకంటే… ప్రస్తుతం చంద్రబాబు రాజభవనం ఉన్నది హైదరాబాద్ లో! తెలుగుదేశం ఎమ్మెల్యేలు, ఏపీ శాసన మండలి ప్రతిపక్ష నాయకుడు యనమల రామకృష్ణుడు, మాజీ మంత్రులలో ఎక్కువ మంది, మాజీ ప్రజారాజ్యాధినేత చిరంజీవి, ప్రస్తుత జనసేనాధిపతి పవన్ కళ్యాణ్, సీపీఐ, సీపీఎం నాయకులు అంతా నెలవైఉన్నది హైదారాబాద్ లోనే కదా!

హైదరాబాద్ టు అమరావతి దగ్గరవుతుంది… హైదరాబాద్ టు విశాఖ దూరమవుతుంది అనేదే తప్ప.. సీరియస్ గా సిన్సియర్ గా ఆలోచిస్తే… అంతకు మించిన సమస్య ఏముంది? హైదరాబాద్ టు విశాఖ విమాన సర్వీసులు ఉన్నాయన్న విషయం తెలియదా? ఉన్నతాధికారులు, రాజకీయ నాయకులు రహస్యంగా సమావేశమయ్యే స్టార్ హోటళ్లకు కూడా విశాఖలో కొదవలేదు! మరి ఇంకేంటి సమస్య..? ఇన్ సైడ్ ట్రేడింగ్ అనుకోవాలా? రాజధానికి భూములిచ్చిన రైతుల సంగతంటారా… అది “సీఎం” (ముఖ్యమంత్రి) చూసుకుంటారు! అది ఆయన బాధ్యత కూడా! జగన్.. తన బాధ్యతలు తనకు ఒకరు గుర్తుచేయాల్సిన పరిస్థితిలో లేరు… క్లియర్!

సామాన్యుడికి దూరం అయిపోతుందంటారా? సామాన్యుడికి రాజధాని అమరావతిలో అయినా ఆముదాలవలసలో అయినా పర్లేదు అనేది గట్టిగా వినిపిస్తున్న మాట! ఎవరికి వారికి.. మాకు దగ్గరగా ఉంటే బాగుండు, మా జిల్లాలో ఉంటే బాగుండు అనిపించడం సహజం.. కాని మనమంతా ఆంధ్రులమే కదా… సర్దుకోగలరు! కానీ… ఈ పెద్దలే సర్ధుకోలేకపోతున్నారు… అలా అని తమకున్న నిజమైన సమస్యను బయటకు చెప్పలేకపోతున్నారు! ఎందుకంటే… సామాన్యుడికి సచివాలయం వరకు వెళ్ళవలసిన అవసరం వారి జీవితకాలంలో అతి తక్కువ సార్లు ఏర్పడే పరిస్థితి. పైగా జగన్ గ్రామ సచివాలయాలు పెట్టినప్పటినుంచీ… మండలాఫీసుకు కూడా వెళ్లనవసరం లేని సౌకర్యం వచ్చేసింది.

ఈ షిప్టింగుల్లో ఏమైనా కాస్తో కూస్తో ఇబ్బంది ఉంటే అది సచివాలయం ఉద్యోగులకు మాత్రమే అయ్యి ఉండాలి!! ఉన్నపలంగా హైదరాబాద్ నుంచి అమరావతికి వచ్చినవారు… కాస్త టైం తీసుకుని ప్రశాంతంగా అమరావతి నుంచి విశాఖకు వెళ్లలేరా? వెళ్తారు..!! మరి ఇంకేంటి ప్రాబ్లం… నిజంగా బాబుకు అమరావతి ఒక డ్రీం అయితే.. శాస్వత పునాదులు వేయాల్సింది కదా! లేదా మళ్లీ అధికారంలోకి వచ్చేలా పాలించి ఉండొచ్చు కదా! అన్నీ అనుకూలంగా జరగలాంటే మనం కూడా ప్రజలకు అనుకూలంగా ఉండాలి కదా!! బాబుకు తెలియంది కాదు!!

ఇంత చెపుకున్నా కూడా… “ఇంకా అమరావతే కావాలి.. అక్కడ ఏమున్నా – ఏమి లేకున్నా.. మాకు అమరావతే కావాలి” అని లాజిక్ లేని మొండి పట్టుదలకు పోతామంటారా? “విశాఖలో కలుద్దాం…” అంటున్నారు “సీఎం”!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here