భర్త నుంచి విడాకులు తీసుకున్న మహిళ మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్న ఘటన ఎల్బీనగర్ పీఎస్ పరిధిలో జరిగింది. నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలం రాంరెడ్డిపల్లి గ్రామానికి చెందిన జంపాల లక్ష్మమ్మ హైదరాబాద్లోని ఎన్టీఆర్ నగర్లో ఉంటూ కూరగాయల మార్కెట్లో పనిచేస్తోంది. ఈమెకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కూతురు ధనమ్మ(20)కు రెండేళ్ల క్రితం ఓ వ్యక్తితో వివాహమైంది. అయితే భర్తతో మనస్పర్థల కారణంగా ఆమె మూడు నెలల క్రితం విడాకులు తీసుకుని తల్లిలో కలిసి ఉంటోంది.
Also Read:
ఒంటరితనం భరించలేక ధనమ్మ కొద్దిరోజులుగా తీవ్ర మనోవేదనతో బాధపడుతోంది. దీనికి తోడు తల్లితో తరుచూ గొడవలు జరుగుతుండటంతో కుంగిపోయింది. దీంతో సోమవారం తెల్లవారుజామున తల్లి, చెల్లి మార్కెట్కు వెళ్లగా ధనమ్మ ఒంటరిగా ఉంది. కాసేపటి తర్వాత ఇద్దరూ ఇంటికి రాగా తలుపు వేసి ఉంది. ఎంతసేపటికీ తలుపు తీయకపోవడంతో వారిద్దరూ లోనికి వెళ్లి చూడగా ధనమ్మ చున్నీతో పైకప్పునకు ఉరేసుకుని కనిపించింది. దీంతో వారు ఎల్బీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించి మృతదేహానికి పోస్టుమార్టం చేయించారు. మనోవేదనతోనే ధనమ్మ ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది.
Also Read: