ఎంపీ రఘురామకృష్ణం రాజు ఇటీవల బాగా వార్తల్లో కెక్కారు. గెలిచిన వైసీపీని కాదని ఆయన మాట్లాడుతూ ఏపీ రాజకీయాల్లో చర్చను మొదలు పెట్టారు. రాష్ట్రంలో భారీ మెజార్టీతో అధికారం చేపట్టిన జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయన ప్రవర్తిస్తున్న విషయం తెలిసిందే.
అయితే పార్టీ విధానాలకు వ్యతిరేకంగా రఘరామకృష్ణంరాజు తీరు ఉందని దీనిపై చర్యలు తీసుకోవాలని వైసీపీ లోక్సభా పక్షం స్పీకర్కు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఆయనపై అనర్హత వేటు వేయాలని కోరిన నేపథ్యంలో ఈయన దీనిపై హైకోర్టును ఆశ్రయించగా.. హైకోర్టు రఘురామకు అనుకూలంగానే తీర్పు ఇచ్చింది. కాగా ఇటీవల ఆయన ప్రభుత్వంపై అదే రీతిలో మాట్లాడుతున్నారు. ఈ పరిస్థితుల్లో బాపట్ల ఎంపీ నందిగం సురేష్ విషయంలో ఆయన చేసిన వ్యాఖ్యలు రఘురామను చిక్కుల్లో పడేలా చేస్తాయని అంటున్నారు.
ఆయన కుల వృత్తిని తక్కువ చేస్తూ రఘురామా మాట్లాడారని దీనిపై చర్యలు తీసుకోవాలని నందిగం సురేష్ లోక్సభ స్పీకర్ ఓంబిర్లాను కలిసి ఫిర్యాదు చేశారు. తనపై ఇష్టానుసారంగా మాట్లాడిన ఈయనపై చర్యలు తీసుకోవాలని కోరారు. పలు వీడియో క్లిప్పింగులను కూడా అందజేసినట్లు తెలుస్తోంది. అయితే మొన్న వైసీపీ లోక్ సభా పక్షం ఫిర్యాదులో హైకోర్టు తీర్పుతో ఊరట పొందిన ఈయన ఇప్పుడు బాపట్ల ఎంపీ ఫిర్యాదుతో మాత్రం చిక్కుల్లో పడటం ఖాయంగా చెబుతున్నారు. ప్రభుత్వ విధానాలపై, సొంత పార్టీపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఎవరికైనా వేటు తప్పదని పొలిటికల్ సర్కిల్స్లో ప్రచారం ఊపందుకుంది. మరి రఘురామకృష్ణంరాజు ఈ విషయంలో ఏం చేస్తారో చూడాలి. దీనికి కూడా ఆయన ఏదో ఒకటి రెడీ చేసుకొని తప్పించుకునే ప్రయత్నాలు మొదలుపెట్టింటారని రాజకీయ మేధావులు అనుకుంటున్నట్లు తెలుస్తోంది.