తాజాగా ఏపి ప్రభుత్వం మరో పాలసీని తీసుకువచ్చింది. ఫార్మా, టెక్స్టైల్, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్, పెట్రో కెమికల్స్ లాంటి కీలక రంగాలలో పెట్టుబడులకు ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు సూక్ష్మ, చిన్న పరిశ్రమలకు సాయం చేసేందుకు ఏపీ ప్రభుత్వం నూతన పారిశ్రామిక పాలసీని తీసుకొచ్చింది. రాష్ట్ర మంత్రి మేకపాటి గౌతం రెడ్డి, ఏపీఐఐసీ చైర్పర్సన్ రోజా దీన్ని ఆవిష్కరించారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళా పారిశ్రామికవేత్తలకు ఈ నూతన విధానం ద్వారా రాయితీ ఇచ్చి చేయూతనివ్వనున్నారు. అన్ని రంగల్లో అభివృద్ధి సాధించడమే ధ్యేయంగా సీఎం జగన్ ఈ నూతన పాలసీని రూపొందించారు. సులువైన నిబంధనలతో వైఎస్సార్ ఏపీ వన్ పేరిట సింగిల్ విండో కేంద్రం ఏర్పాటుచేశామని ఈ సందర్బంగా మంత్రి మేకపాటి గౌతం రెడ్డి అన్నారు.
గత ప్రభుత్వం తీసుకొచ్చిన పారిశ్రామిక విధానం అమలుకు సాధ్యం కాదన్నారు. అందుకే అన్ని విధాలా ఆలోచించి అందరికీ అందుబాటులో ఉండే నూతన విధానాన్ని తీసుకువచ్చామని మంత్రి తెలిపారు. అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా కొత్త పాలసీ ఉంటుందన్నారు.
ఏపీఐఐసీ చైర్పర్సన్ రోజా మాట్లాడుతూ తమ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త పాలసీతో రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి వేగంగా ఉంటుందన్నారు. ఈ పాలసీ మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించే విధంగా ఉందని చెప్పారు. మొత్తానికి అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని అభివృద్ది చేస్తానని చెబుతున్న సీఎం వై.ఎస్ జగన్ కొత్త పాలసీతో ఉద్యోగ, ఉపాది, అభివృద్ధిలో ఏ విధంగా ముందుకుపోతారో వేచి చూడాలి.