వైఎస్సార్ చేయూత ప్రారంభించడం అదృష్టమని ఏపీ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. 45 నుంచి 60 ఏళ్ల మధ్య మహిళలకు సంబంధించి ఏ పథకము లేదన్నారు. ఇప్పుడు వైఎస్సార్ చేయూత ద్వారా వీరికి మంచి జరుగుతుందని జగన్ అన్నారు.
కార్పొరేషన్ల పేరుతో గతంలో ఇచ్చే రుణాలు గ్రామంలో ఒకరికో, ఇద్దరికో వచ్చేవన్నారు. దీనివల్ల ఎవ్వరికీ ఉపయోగం ఉండేది కాదన్నారు. వీరికి మాత్రమే రుణం వస్తే మిగిలిన వాళ్ల పరిస్థితి ఏమిటన్నారు. అందుకే సంవత్సరానికి రూ. 18750 ఇస్తూ నాలుగేళ్ల పాటు వీరిని నడిపిస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. మంచి చేయాలనే ఉద్దేశంతో ఇది చేశామని.. దీని వల్ల మహిళలు తమ జీవితాలు మార్చుకునే అవకాశం వస్తుందన్నారు.
అయితే ఇక్కడ మరో బృహత్తర ప్రణాళిక తీసుకొచ్చామన్నారు. మహిళలు తమ అకౌంట్లలో పడిన డబ్బులు తీసుకోకుండా వ్యాపారం చేయాలంటే కూడా వెసులుబాటు కల్పించినట్లు చెప్పారు. వాలంటీర్లు, గ్రామ సచివాలయ ఉద్యోగులు మహిళల వద్దకు రెండు పేజీల లేఖ తీసుకొని వెళ్లి మీకు ఏదైనా వ్యాపారం చేయాలని ఉంటే ఎంచుకోవాలని చెప్తారు. వ్యాపారం చేసేందుకు ముందుకు వచ్చిన వారికి వివిధ కంపెనీలు, బ్యాంకులతో మాట్లాడి వ్యాపారం చేసుకునేందుకు అవకాశం కల్పిస్తారన్నారు.
ఒకవేళ వ్యాపారం చేసేందుకు ఇష్టం లేని వారిని ఎవ్వరూ బలవంత పెట్టరని జగన్ అన్నారు. వైఎస్సార్ జాబితాకు దరఖాస్తు చేసుకోని వారికోసం మరోసారి అవకాశం ఇస్తున్నట్లు ఆయన చెప్పారు.