రాష్ట్రంలో అభివృద్ధే లక్ష్యంగా ముందుకు వెళుతున్న ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. మహిళల అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పిన సీఎం.. ఆ దిశగానే ముందుకు వెళుతున్నారు. చెప్పిన విధంగానే వైఎస్సార్ చేయూతను జగన్ ప్రారంభించారు.
అక్కచెల్లెమ్మల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ఉద్దేశించిన వైఎస్సార్ చేయూత పథకాన్ని వై.ఎస్ జగన్ ప్రారంభించారు. ఈ పథకంతో రాష్ట్రంలో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు రూ. 18,750 అందుతాయి. వరుసగా నాలుగు విడతల్లో ఈ నగదు అక్కచెల్లెమ్మల అకౌంట్లలో జమ అవుతాయి. మొత్తం 75వేల రూపాయలు 25 లక్షల మంది మహిళలకు ఈ పథకం కింద అందనున్నాయి. 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్య ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు ఈ పథకం కింద లబ్ది చేకూరనుంది.
ఈ పథకం కోసం బడ్జెట్లో రూ. 4,700 కోట్లు కేటాయించారు. ఇప్పటికే అమ్మఒడి, రైతు భరోసా, పించన్ల పెంపు వంటి కార్యక్రమాలతో దూసుకుపోతున్న ఏపీ.. ఇప్పుడు మహిళల అభివృద్ధి కోసం తీసుకొచ్చిన వైఎస్సార్ చేయూతను ప్రారంభించి మరో చరిత్ర సృష్టించిందని ప్రజలు చెప్పుకుంటున్నారు. వైఎస్సార్ చేయూత లబ్ధిదారుల సాధికారిత కోసం ప్రభుత్వం ఇప్పటికే అమూల్, ఐటీసీ, హెచ్యూఎల్, పీ అండ్ జీ, జియోమార్ట్ లాంటి ప్రఖ్యాత కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుంది. ఔత్సాహిక వ్యాపారస్తులుగా మారడానికి అవసరమైన సాంకేతిక, మార్కెటింగ్ సహకారాలను ఈ కంపెనీలు అందిస్తాయి.