చంద్రబాబు ఓట్లు కొనడం కోసం పసుపు కుంకుమ పథకాన్ని ప్రవేశపెట్టారని ఏపీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస్ వేణు గోపాలకృష్ణ అన్నారు. సంక్షేమ పథకాలను అడ్డం పెట్టుకొని చంద్రబాబు తన కొడుకు కోసం పాటుపడ్డారని మండిపడ్డారు.
ఇక పాదయాత్రలో ఇచ్చిన మాట ప్రకారం జగన్ వైఎస్సార్ చేయూత ప్రారంభించినట్లు చెప్పారు. మహిళలను చంద్రబాబు ఏనాడు పట్టించుకోలేదన్నారు. డ్వాక్రా రుణాల విషయంలో బాబు మహిళల్ని మోసం చేశారన్నారు. ఎన్నికల ముందు కేవలం ఓట్ల కోసం చంద్రబాబు పసుపు కుంకుమ తీసుకొచ్చారని దుయ్యబట్టారు.
రాష్ట్రం సంక్షోభంలో ఉన్నప్పటికీ సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్న వ్యక్తి సీఎం జగన్ అన్నారు. బడుగు, బలహీన వర్గాల మహిళలకు వైఎస్సార్ చేయూత ద్వారా మంచి జరుగుతుందన్నారు. సీఎం జగన్ చేస్తున్న సంక్షేమ యజ్ఞాన్ని టిడిపి నేతలు అడ్డుకుంటున్నారన్నారు. బీసీల వెన్ను చంద్రబాబు విరిచారన్న మంత్రి…బీసీ సంక్షేమంపై చర్చకు తాము సిద్ధమని తెలిపారు.
బాబు అధికారంలో ఉన్నప్పుడు మహిళల ఇంటికి బంగారం పంపిస్తామని చెప్పి బ్యాంకు నోటీసులు పంపించారని తెలిపారు. ప్రభుత్వంపై బుదర జల్లాలనే ఉద్దేశంతోనే టిడిపి నేతలు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారన్నారు. వైఎస్సార్ చేయూతపై విమర్శలు చేస్తే బాబుకు మహిళలు మళ్లీ బుద్ది చెబుతారన్నారు.