మహిళల్ని మోసం చేసిన ఘనత తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడుది అని ఏపీ హోంమంత్రి మేకతోటి సుచరిత అన్నారు. చంద్రబాబుపై ఆమె తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దేశంలోనే సీఎం జగన్ కు ప్రత్యేక గుర్తింపు వచ్చిందన్నారు.
మహిళలు ఆర్థికంగా స్థిరపడటం కోసం సీఎం జగన్ అనేక నిర్ణయాలు తీసుకుంటున్నారని మంత్రి తెలిపారు. జగన్ తాను చేసిన పాదయాత్ర ద్వారా మహాళల కష్టాలు తెలుసుకున్నారని చెప్పారు. అందుకే వైఎస్సార్ చేయూత కార్యక్రమాన్ని తీసుకొచ్చారన్నారు. రాష్ట్రంలోని 23 లక్షల మంది మహిళలు వైఎస్సార్ చేయూత ద్వారా లబ్ది పొందుతున్నారని తెలిపారు.
సీఎం జగన్కు ప్రజల్లో ఉన్న ఆదరణను చూసి తెలుగుదేశం పార్టీ ఓర్వలేకపోతోందన్నారు. అత్యంత ప్రజాదరణ కలిగిన ముఖ్యమంత్రుల్లో జగన్ మూడవ స్థానంలో ఉన్నట్లు గుర్తు చేశారు. ఇక ఇళ్ల పట్టాల విషయంలో 30 లక్షల మంది మహిళలకు ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు జగన్ ముందుకు వెళుతున్నారన్నారు. ఈ విషయంలో కూడా టిడిప అడ్డుపడుతోందన్నారు.
టిడిపి కుల రాజకీయాలు చేస్తోందన్నారు. దళితులపై దాడుల విషయంలో తమ ప్రభుత్వం వెంటనే స్పందించి బాధ్యులపై చర్యలు తీసుకుందన్నారు. ఇక చంద్రబాబు ప్రభుత్వం మహిళలకు ఇచ్చిన హామీలు అమలు చేయలేదన్నారు. అయితే సీఎం జగన్ మహిళల అభివృద్ధి కోసం అన్ని విధాలా కృషి చేస్తున్నారన్నారు.