ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ ఢిల్లీ టూర్పై సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. మామ ఈసి గంగిరెడ్డి సంస్మరణ సభలో పాల్గొనేందుకు జగన్ పులివెందుల వెళ్లారు. అక్కడి నుంచి ఆయన నేరుగా ఢిల్లీ వెళతారని ముందుగా చెప్పినా.. ఇప్పుడు ఢిల్లీ టూర్ క్యాన్సిల్ అవుతుందేమో అని అంటున్నారు.
పులివెందులలో ఈసీ గంగిరెడ్డి సంస్మరణ సభ జరిగింది. ఈ కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొన్నారు. ఈసీ గంగిరెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో వైఎస్ విజయమ్మ, వైఎస్ భారతి, ఎంపీలు విజయసాయిరెడ్డి, వైఎస్ అవినాష్రెడ్డి, పార్టీ నేతలు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఇక్కడ కార్యక్రమాల తర్వాత ముఖ్యమంత్రి ఢిల్లీ బయలు దేరి వెళతారని ముందుగా సమాచారం బయటకు వచ్చింది. అయితే ప్రస్తుతం ఢిల్లీ టూర్కు వెళతారా లేదా అన్నది ఇంకా తెలియలేదు.
మామూలుగా అయితే జగన్ నేడు ఢిల్లీకి వెళ్లి రేపు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో భేటి అవ్వాల్సి ఉంది. ఇందుకు అపాయింట్మెంట్ కూడా ఖరారైంది. అయితే మోదీ బిజీ షెడ్యూల్ కారణంగా అపాయింట్మెంట్ రద్దయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. దీంతో ఢిల్లీకి వెళ్లాలా వద్దా అన్న యోచనలో సీఎం జగన్ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై అధికారికంగా ఎలాంటి సమాచారం బయటకు రాలేదు. సీఎం జగన్ టూర్ విషయంలో మోదీ అపాయింట్మెంట్కు సంబంధించిన పలు వార్తలు బయటకు వస్తున్నాయి. వీటిని సీఎం కార్యాలయం దృవీకరించాల్సి ఉంది.