కరోనా వచ్చిన తర్వాత నదీ స్నానాలు చేసే వారికి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇప్పటికే పవిత్ర తుంగభద్ర నదీ పుష్కరాల్లో పుష్కరస్నానాలు చేయకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చే తుంగభద్ర పుష్కరాల్లో స్నానాలు నిషేధించడంతో భక్తులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు.
తాజాగా గంగా నదీ స్ననాలు కూడా నిషేధించారు. ఈ నెల 30న కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులకు గంగానదిలో స్నానాలు చేసేందుకు హరిద్వార్ జిల్లా అధికారులు అనుమతి నిరాకరించారు. కొవిడ్-19 మహమ్మారి కారణంగా ఈ సారి పుణ్యస్నానాలను నిషేధించినట్టు అధికారులు ఇవాళ ప్రకటించారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా ఏటా ఢిల్లీ, హర్యానా, హిమాచల్ ప్రదేశ్ సహా దేశం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు పుణ్యస్నానాల కోసం గంగానదీ తీరానికి వస్తారు.
అయితే కొవిడ్-19 నేపథ్యంలో కేంద్రం వెలువరించిన మార్గదర్శకాలను అనుసరించి ఈ ఏడాది కార్తీక పౌర్ణమి సందర్భంగా ప్రజలు నదీస్నానాలు ఆచరించడాన్ని నిలిపివేయాలని నిర్ణయించినట్టు హరిద్వార్ జిల్లా కలెక్టర్ సి. రవిశంకర్ పేర్కొన్నారు. పుణ్యస్నానాల కోసం ప్రజలు పెద్దఎత్తున ఘాట్లలో గుమికూడే అవకాశం ఉందనీ… దీనివల్ల వైరస్ వ్యాప్తిచెందే ప్రమాదం ఉందని ఆయన పేర్కొన్నారు.
నిషేధం విధించిన నదుల్లో స్నానాలు చేస్తున్న వారి పట్ల పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. తుంగభద్ర పుష్కరాల్లో నిబంధనలు ఉల్లంఘించి స్నానాలు చేసిన వారిపై ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలో అధికారులు చర్యలు తీసుకున్నారు. ఇక గంగా స్నానాల విషయంలో కూడా నిబంధనలు ఉల్లంగించిన వారికి అంటు వ్యాధుల నిరోధక చట్టం 1897తో పాటు విపత్తుల నిరోధక చట్టం 2005 కింద చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.