అసెంబ్లీ సమావేశాలు అంటేనే మనకు వెంటనే అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ మధ్య మాటల యుద్ధం గుర్తుకు వస్తుంది. అయితే ఇప్పుడు ఏపీలో అదే జరగబోతోంది. ఎందుకంటే త్వరలోనే ఏపీలో అసెంబ్లీ సమావేశాలు జరుగనున్నాయి.
ఈ నెల 30 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు అసెంబ్లీ కార్యదర్శి నోటిఫికేషన్ జారీ చేశారు. నవంబర్ 30న ఉదయం 9 గంటలకు శాసనసభ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. ఐదు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే 30న స్పీకర్ తమ్మినేని సీతారాం అధ్యక్షతన బీఏసీ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ఎన్ని రోజులు సభను నిర్వహించాలి. అలాగే అసెంబ్లీ సమావేశాల అజెండాను స్పీకర్ ఖరారు చేయనున్నారు.
ఇక అసెంబ్లీ సమావేశాల్లో ప్రధానంగా అమరావతి భూముల విషయం, ఆలయాలపై దాడుల విషయం, కరోనా కట్టడి విషయంతో పాటు పంచాయతీ ఎన్నికల నిర్వహణపై వాడీవేడీగా మాటల యుద్దం జరిగే అవకాశాలు కనిపిస్తాయి. ఎందుకంటే లాక్డౌన్ కారణంగా ఇంతవరకు రాజకీయ పార్టీల నేతలు పూర్తి స్థాయిలో ప్రజల్లోకి రాలేకపోయారు. ఇప్పుడు అసెంబ్లీ వేదికగా అందరూ ఒక్కచోట కలవడంతో ఒకరిపై ఒకరు తీవ్రంగా విమర్శలు చేసుకునే అవకాశం ఉందని రాజకీయ మేధావులు చెబుతున్నారు. ఏపీ సీఎం జగన్తో పాటు, మంత్రులు కొడాలి నాని, బుగ్గన, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, అచ్చెన్నాయుడు ఏ విదంగా మాట్లాడనున్నారన్న దానిపై ఆసక్తి నెలకొంది.