దేశంలో జమిలి ఎన్నికలు వస్తాయన్న ప్రచారం గత సంవత్సరం నుంచి సాగుతూనే ఉంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం జమిలి ఎన్నికలు వస్తాయని అప్పట్లో అభిప్రాయం వ్యక్తం చేసింది. దీంతో దేశ వ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు వస్తాయన్న ప్రచారం జోరుగా సాగింది.
అయితే దేశంలోని పలు రాష్ట్రాలలో ఎన్నికలు జరుగుతూనే ఉన్నాయి. వచ్చే సంవత్సరం కూడా పలు రాష్ట్రాలలో ఎన్నికలు జరుగుతాయి. అయితే ఈ పరిస్థితుల్లో జమిలి ఎన్నికలు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. కాగా నేడు ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు మరోసారి జమిలి ఎన్నికలను గుర్తు చేశాయి. 80వ ‘ఆలిండియా ప్రిసైడింగ్స్ ఆఫీసర్స్’ జాతీయ సదస్సును ప్రధాని మోదీ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ….. ‘‘జమిలి ఎన్నికలపై చర్చ అనవసరం. దేశానికి అవి అత్యంత ఆవశ్యకం. కొన్ని నెలల వ్యత్యాసాల్లోనే దేశంలో ఎక్కడో ఒక చోట ఎన్నికలు జరుగుతూనే ఉంటున్నాయి. దీంతో అభివృద్ధి కార్యక్రమాలపై తీవ్ర ప్రభావం పడుతోందన్న విషయం ప్రజానీకానికి అర్థమవుతూనే ఉంది. ఈ సమస్యను అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. దీనిపై ప్రిసైడింగ్ అధికారులు తగిన మార్గదర్శనం చేయాల్సిన ఆవశ్యకం ఉంది.’’ అని మోదీ పేర్కొన్నారు.
దేశ వ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు జరిగితే బాగుంటుందన్న అభిప్రాయం పలువురు వ్యక్తం చేస్తున్నారు. అయితే దీనిపై పూర్తి స్థాయిలో అధ్యయనం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.