కరోనా విజృంభిస్తున్నా క్రికెట్ జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో అత్యంత జాగ్రత్తలు తీసుకొని నిర్వాహకులు క్రికెట్ క్రీడను జరిపిస్తున్నారు. అయినప్పటికీ పలువురు క్రికెటర్లు కరోనా బారిన పడుతున్నారు. తాజాగా ఆరుగురు క్రికెటర్లకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది.
న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లిన పాకిస్థాన్ ఆటగాళ్లలో 6 మందికి కరోనా సోకింది. మూడు టీ20, రెండు టెస్టుల సిరీస్ కోసం న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లారు. న్యూజిలాండ్లో పాక్ ఆటగాళ్లు కరోనా బారినపడడం ఒక్కసారిగా కలకలం రేపింది. బాధితులు ఆరుగురిని కఠిన క్వారంటైన్కు తరలించినట్టు కవీస్ బోర్డు తెలిపింది. ఆటగాళ్లు లాహోర్లో బయలుదేరినప్పుడు 53 మంది సభ్యుల బృందం వారిని పరీక్షించిందని, ఈ నెల 24న క్రైస్ట్చర్చ్ చేరుకున్న తర్వాత కూడా వారిని పరీక్షించినట్టు న్యూజిలాండ్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.
వారిని కనీసం మరో నాలుగు సార్లు పరీక్షించనున్నట్టు పేర్కొంది. ఆటగాళ్లు మొత్తం వారి గదులకే పరిమితమై ఉండనున్నట్టు తెలిపింది. గదుల్లో ఉన్న చాలామంది ఆటగాళ్లు ఐసోలేషన్ నిబంధనలు నిబంధనలు ఉల్లంఘిస్తున్నట్టు తేలిందని, వారికి ఫైనల్ వార్నింగ్ ఇస్తామని హెచ్చరించింది. పాకిస్థాన్ జట్టు న్యూజిలాండ్ రావడం సంతోషకరమే అయినా, వచ్చినవారు తప్పకుండా కొవిడ్ నిబంధనలు పాటించాల్సిందేనని ఆరోగ్య అధికారి ఆష్లీ బ్లూమ్ఫీల్ డ్ పేర్కొన్నారు.