భారత్లో ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. దీంతో అనుకోని పరిస్థతుల్లో పలువురు జవాన్లు ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా శ్రీనగర్లో ఉగ్రవాదులు దాడులు చేశారు. శ్రీనగర్ లోని హెచ్ఎంటీ ప్రాంతంలో జవాన్లపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ‘క్విక్ రియాక్షన్’ టీమ్కు చెందిన ఇద్దరు జవాన్లు అమరులయ్యారు.
క్విక్ రియాక్షన్ టీమ్ లోని ఇద్దరు జవాన్లపై కాల్పులు జరపడంతో వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స అందిస్తున్న సమయంలో ఆ ఇద్దరు ప్రాణాలు కోల్పోయారని ఉన్నతాధికారులు తెలిపారు. మరోవైపు హెచ్ఎంటీ ప్రాంతం అత్యంత రద్దీగా ఉండే ప్రాంతం కాబట్టి, పౌర నష్టం ఎక్కువగా జరగకుండా జాగ్రత్తలు పాటిస్తూ భద్రతా బలగాలు ఉగ్రవాదులకు సమాధానమిచ్చాయి. జైషేమహ్మద్ తీవ్రవాద సంస్థ కార్యకలాపాలు ఈ ప్రాంతంలో ఎక్కువగా ఉన్నాయని, వారిని పట్టుకోడానికి ప్రయత్నిస్తామని ఐజీ విజయ్ కుమార్ తెలిపారు. ఇద్దరు ఉగ్రవాదులు కారులోంచే భద్రతా బలగాలపై కాల్పులు జరిపినట్లు ఐజీ విజయ కుమార్ తెలిపారు.
ఇటీవలె జమ్మూ-కశ్మీరులోని రాజౌరీ జిల్లాలో, నౌషేరా సెక్టర్లో నియంత్రణ రేఖ వెంబడి పాకిస్థాన్ విచక్షణారహితంగా కాల్పులు జరిపింది. దీంతో ఓ భారతీయ జవాను అమరుడయ్యారు. పాకిస్థాన్ దళాలకు భారతీయ దళాలు దీటుగా బదులిస్తున్నట్లు భారత సైన్యం ఓ ప్రకటనలో తెలిపింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ పాకిస్థాన్ దళాలు విచక్షణారహితంగా కాల్పులు జరిపినట్లు పేర్కొంది.