రాష్ట్రంలో భారీ మెజార్టీతో గెలిచిన వైసీపీ .. రాబోయే ఏ ఎన్నికలొచ్చినా అదే మెజార్టీ సాధించాలని చూస్తోంది. ఇందుకోసం ఇప్పటి నుంచే కసరత్తులు ప్రారంభించింది. ఎన్నికల హడావిడి ఇంకా ప్రారంభం కాకముందే నేతలు ప్రజలను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు.
రాష్ట్రంలో అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ సమయానికంతా పంచాయతీ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలు జరిగి ఉండేవి. గెలిచిన నేతలు వారి వారి పదవుల్లో ఉంటూ ఉండేవారు. కానీ కరోనా మహమ్మారి కారణంగా ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన అనంతరం ఎన్నికలు వాయిదా పడ్డాయి. దీంతో అన్ని ఎన్నికల ప్రక్రియ నిలిచిపోయినట్లైంది.
అయితే త్వరలోనే మళ్లీ ఈ ఎన్నికలు జరుగుతాయని తెలుస్తోంది. మరో రెండు మూడు నెలల్లో కరోనా వైరస్ విజృంభణ తగ్గుముఖం పడుతుందని చెబుతున్నారు. ఆ తర్వాత ఏపీ సర్కార్ వెంటనే ఈ ఎన్నికలపై ఫోకస్ పెట్టే అవకాశం కనిపిస్తోంది. అందుకే దీన్ని దృష్టిలో ఉంచుకున్న నేతలు ఇప్పటి నుంచే ఓటర్లను ఆకర్షించే పనిలో పడ్డారు.
తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో ఇప్పటి నుంచే నాయకులు ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు వైసీపీ నేతలు ఇప్పటినుంచే సన్నద్దమవుతున్నట్లు అనిపిస్తోంది. వైసీపీ ఎమ్మెల్యేలు, నేతలు అధికారులతో కలిసి కాలనీల్లో గుడ్ మార్నింగ్ రాజమండ్రి అనే కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమం ద్వారా నగరంలోని ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలను కలుస్తున్నారు. ప్రజా సమస్యల గురించి తెలుసుకోవడంతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు తీరు గురించి ఆరా తీస్తున్నారు.
గుడ్ మార్నింగ్ రాజమండ్రి కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి చెల్లుబోయిన వేణు గోపాల కృష్ణ మాట్లాడుతూ
రాష్ట్రంలో పేదరిక నిర్మూలన యుద్దం జరుగుతోందన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి ఇంటింటికి వెళ్లి అడగడం మంచిదేనన్నారు.