కాంగ్రెస్ పార్టీ ఇటీవల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. గత ఏడాది లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోవడంతో రాహుల్ గాంధీ ఆ పార్టీ అధ్యక్ష పదవి నుంచి వైదొలగారు. దీంతో పార్టీ సారథ్య బాధ్యతలను సోనియా గాంధీ మళ్లీ చేపట్టారు. కాగా ఇప్పుడు మరోసారి రాహుల్ అధ్యక్షుడు అవుతారన్న ఊహాగానాలు ఎక్కువయ్యాయి.
సోనియా గాంధీ నివాసం 10, జన్పథ్లో శనివారం జరిగిన సమావేశంలో సోనియా గాంధీతోపాటు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా, ‘అసమ్మతివాద’ సీనియర్ నేతలు పాల్గొన్నారు. నాలుగు గంటలపాటు సుదీర్ఘంగా చర్చలు జరిపారు. ఈ సమావేశంలో రాహుల్ గాంధీ పార్టీ చెప్పినట్లు నడుచుకొనేందుకు సిద్దంగా ఉన్నట్లు తెలిపారని తెలుస్తోంది. మీరంతా కోరుకున్నట్లుగా పార్టీ కోసం పని చేయడం నాకు ఇష్టమే’’ అని రాహుల్ చెప్పినట్లు తెలిపారు. ఈ సమావేశంలో పాల్గొన్న నేతలు ఎవరూ రాహుల్ గాంధీని విమర్శించలేదన్నారు.
ఈ ఏడాది ఆగస్టులో 23 మంది కాంగ్రెస్ నేతలు ఆ పార్టీ అధిష్ఠానానికి లేఖ రాసిన సంగతి తెలిసిందే. సమష్టి నిర్ణయాలు తీసుకోగలిగిన, చురుకైన నాయకత్వం పార్టీకి అవసరమని పేర్కొన్నారు. పార్టీని ప్రక్షాళన చేయాలని కోరారు. ఈ నేతలు శనివారం జరిగిన సమావేశంలో పాల్గొన్నారు. రానున్నరోజుల్లో పార్టీని బలోపేతం చేయడానికి తగిన మార్గాల గురించి చర్చించేందుకు మేధోమథనాన్ని నిర్వహించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. సమ్మతివాదులతో సహా పార్టీ నేతలెవరికీ రాహుల్ గాంధీ నాయకత్వం పట్ల అభ్యంరాలు లేవని స్పష్టం చేశారు.