ఇటీవలి కాలంలో తెలుగు తెరపై భారీ మల్టీస్టారర్ సినిమాలు తెగ హల్చల్ చేస్తున్న విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్, వెంకటేష్.. మహేష్ బాబు, వెంకటేష్ ఇలా స్టార్ హీరోలు కలిసి నటించి అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నారు. ఇక తాజాగా రాజమౌళి దర్శకత్వంలో రానున్న ఆర్.ఆర్.ఆర్ సినిమాలో రామ్ చరణ్, ఎన్టీఆర్లు కలిసి నటిస్తుండడంతో ఇరు హీరోల ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు.
ఇదిలా ఉంటే టాలీవుడ్లో మరో భారీ మల్టీస్టారర్ చిత్రం తెరకెక్కనుందా అంటే అవుననే సమాధానం వస్తోంది. మలయాళంలో ఘనవిజయం సాధించిన ‘అయ్యప్పన్ కోషియమ్’ సినిమా తెలుగు హక్కులను ఇటీవల సితార ఎంటర్టైన్మెంట్స్ కొనుగోలు చేసింది. ఇద్దరు హీరోలు నటించే ఈ సినిమాలో.. బాలక్రిష్ణ, రానా నటించనున్నారని వార్తలు వచ్చాయి. అయితే దీనిపై ఎలాంటి అధికార ప్రకటన రాలేదు. అయితే తాజాగా వినిపిస్తోన్న సమాచారం ప్రకారం ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్, యంగ్ హీరో రానాలు కలిసి నంటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనికి ఈ ఇరువురు హీరోలు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. ఇక ఈ చిత్రానికి దర్శకత్వం ఎవరు వహించనున్నారన్న దానిపై అనిల్ రావిపూడి, గోపిచంద్ మలినేని పేర్లు వినిపస్తున్నాయి. మరి ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాలంటే అధికార ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.