బీహార్ ఎన్నికల పరిణామాలు ఎన్డీఏ కూటమికి అనుకూలంగా వచ్చాయి. ఎన్డీఏ కూటమి మొత్తం 125 సీట్లను దక్కించుకుంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు 122 సీట్లు కావాల్సివుండగా, ఎన్డీఏ కూటమి దానికన్నా మూడు సీట్లను అధికంగా గెలుచుకుంది. అయితే నితీష్ కుమార్ సీఎం అవుతారా లేదా అన్నదానిపై అనుమానాలు వినిపిస్తున్నాయి.
బీహార్లో 110 స్థానాల్లో బీజేపీ పోటీ చేసి 73 స్థానాలు గెలుచుకోగా.. 115 స్థానాల్లో పోటీ చేసిన జేడీయూ 43 స్థానాల్లో గెలిచింది. ఈ ఎన్నికల్లో మూడో స్థానానికి పడిపోవడం జేడీయూకు నిజంగా చేదు వార్తే. దీంతో ఈ ప్రభావం నితీష్ కుమార్పై పడనుంది. ఈ పరిస్థితుల్లో నితీష్ను సీఎం చేయడానికి బీజేపీ ఒప్పుకుంటుందా.. లేదా మెజార్టీ స్థానాలు గెలుచుకున్నందుకు బీజేపీనే సీఎం స్థానం తీసుకుంటుందా అన్నదానిపై సందిగ్దత నెలకొంది. అయితే జేడీయూకు తక్కువ సీట్లు వచ్చినా తమ సీఎం నితీష్ కుమారే అని బీజేపీ పెద్దలు చెప్పారు.
అయినప్పటికీ బీజేపీ కంటే చాలా తక్కువ సీట్లు గెలుచుకున్న జేడీయూ నేత నితీష్ సీఎం కుర్చీ ఎక్కడానికి ఆసక్తి చూపుతారా అన్న ఆలోచన బీజేపీ వర్గాల్లో వినిపిస్తోంది. ఒకవేళ నితీష్ సీఎం అయినా ఉపముఖ్యమంత్రి, హోం మంత్రి, ఆర్థిక శాఖ ఇలా కీలక శాఖలన్నీ బీజేపీ చేతిలోనే ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇవన్నీ నితీష్ను ఇబ్బంది పెట్టేవే. ఇలాంటి పరిస్థితుల్లో అక్కడి రాజకీయాలు ఆసక్తిగా మారాయి. ఈ పరిస్థతుల నేపథ్యంలో నితీష్ కేంద్ర మంత్రిగా బాద్యతలు చేపడతారని అంతా అనుకుంటున్నారు. దీనిపై మరింత స్పష్టత రావాల్సి ఉంది.