దేశ వ్యాప్తంగా ఉత్కంఠగా మారిన బీహార్ ఎన్నికల్లో ఎన్డీయే ఊహించని ఫలితాలు చూపించిన విషయం తెలిసిందే. సర్వేలు ఎలా చెప్పినా వాటిని తలక్రిందులు చేస్తూ బీజేపీ దూసుకెళ్లింది ఈ పరిస్థితుల్లో ప్రత్యర్థి పార్టీల నేతలకు మామూలుగానే నచ్చదు.
ఈ పరిణామాల్లో బిహార్ శాసన సభ ఎన్నికల్లో ఎన్డీయే కూటమికి ఆధిక్యం కనిపించడంతో మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అగ్ర నేత లాలూ ప్రసాద్ యాదవ్ కలత చెందారు. మంగళవారం ఉదయం నుంచి ఓట్ల లెక్కింపు తీరును గమనిస్తున్న ఆయన ఎన్డీయే ఆధిక్యంలో దూసుకెళ్తున్నట్లు గ్రహించి, వెంటనే టీవీని స్విచాఫ్ చేసి, బయటికి వెళ్ళిపోయారు. లాలూ ప్రసాద్ యాదవ్ రాంచీలోని రిమ్స్కు చెందిన కెల్లీ బంగళాలో ఉంటున్న సంగతి తెలిసిందే. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, ఆయన మంగళవారం ఉదయం నుంచి బిహార్ శాసన సభ ఎన్నికల ఓట్ల లెక్కింపును టీవీలో వీక్షిస్తున్నారు.
మధ్యాహ్నానికి తన కుమారుడు తేజస్వి యాదవ్ నేతృత్వంలోని మహా కూటమి కన్నా ఎన్డీయేకు ఎక్కువ స్థానాలు లభిస్తున్నట్లు గమనించారు. వెంటనే తాను చూస్తున్న టీవీని స్విచాఫ్ చేసి, ఆరుబయటకు వెళ్ళిపోయి, సేద తీరారు. తేజస్వి యాదవ్ తన తండ్రికి బదులుగా ఆర్జేడీకి నాయకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. తాను తండ్రి చాటు బిడ్డననే భావం ప్రజలకు కలగకుండా తేజస్వి జాగ్రత్తపడుతున్నారు. ఆర్జేడీ (144), కాంగ్రెస్ (70), సీపీఐ (6), సీపీఐ(ఎంఎల్) (19), సీపీఎం (4) కలిసి మహా కూటమిగా బిహార్ శాసన సభ ఎన్నికల్లో పోటీ చేశాయి.