ప్రేమ దేన్నయినా జయిస్తుందని అందరూ అంటుంటే మనం వింటుంటాం. కానీ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ను కూడా ప్రేమ జయిస్తుందని తెలుస్తోంది. ఆసుపత్రిలో విషమంగా ఉన్న కరోనా రోగి ఆరోగ్య పరిస్థితి ప్రేయసి దగ్గరకు రాగానే కాస్త మెరుగైంది.
అమెరికాలోని టెక్సాస్లో ఉంటున్న కార్ల్ మునిజ్, లిమానీ ఒకరికొకరు ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకుందామని అనుకునే లోపు కరోనా మహమ్మారి విజృంబించింది. దీంతో కార్ల్ మునిజ్ కూడా కరోనా పాజిటివ్ రావడంతో శాన్ ఆంటోనియా మెత్డిస్ట్ హాస్పిటల్లో చేరారు. ఆయన పరిస్థితి విషమించడంతో ఐసీయూలో ఉంచి చికిత్స అందించారు.
హాస్పిటల్లో కొన్ని రోజులు ఉండటంతో అతని గురించి డాక్టర్లు, నర్సులు ఆరా తీశారు. దీంతో తన పెళ్లి ఆగిపోయిందన్న విషయాన్ని వారు తెలుసుకున్నారు. పెళ్లి చేసుకోవాలని ఆయనకు సలహా కూడా ఇచ్చారు. అయితే ఇలా హాస్పిటల్ బెడ్పై ఉన్న తనను లిమానీ పెళ్లి చేసుకుంటుందో లేదో అని అనుకున్నాడు. అయినప్పటికీ విషయం తెలియగానే లిమానీ పెళ్లికి ఒప్పుకుంది.
దీంతో హాస్పిటల్ బెడ్పై మునిజ్ ఉండగానే ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. వారి సాంప్రదాయం ప్రకారం ఒకరి చేతిని ఒకరు పట్టుకొని వివాహం చేసుకున్నట్లు ప్రమాణం చేశారు. పెళ్లి చేసుకున్న తర్వాత కార్ల్ మునిజ్ ఆరోగ్యంలో చాలా మార్పులు వచ్చినట్లు వైద్యులు చెప్పారు. ఇలా పెళ్లి చేసుకుంటే ఆరోగ్యంలో మార్పులు వచ్చి కరోనాను జయించేందుకు రెడీ అవుతున్న ఈయన ఇప్పుడు హాట్ టాపిక్గా మారారు.