రెండు తెలుగు రాష్ట్రాలు జల వివాదాలు పరిష్కారం కోసం సిద్ధమవుతున్న తరుణంలో మరో తంటా వచ్చి పడింది. సదరు కేంద్ర మంత్రికి కరోనా పాజిటివ్ రావడంతో అపెక్స్ కౌన్సిల్ సమావేశం వాయిదా పడినట్లు తెలుస్తోంది.
తెలంగాణ అక్రమ ప్రాజెక్టులు కడుతోందని ఏపీ, ఏపీ అక్రమంగా నిర్మాణాలు చేపడుతోందని తెలంగాణాలు ఒకరిపై ఒకరు కేంద్ర మంత్రికి ఫిర్యాదులు ఇచ్చిన విషయం తెలిసిందే. దీనిపై అపెక్స్ కౌన్సిల్లో తేల్చుకోవాలని ఇరు రాష్ట్రాలు గట్టిగా నిర్ణయించుకున్నాయి. ఈ నేపథ్యంలో ఈ నెల 25వ తేదీన అపెక్స్ కౌన్సిల్ సమావేశం నిర్వహించాలని ఇప్పటికే నిర్ణయించారు.
కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ కరోనా సోకింది. దీంతో ఆయన హాస్పిటల్లో చేరారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం మేరకు ఏర్పాటైన అపెక్స్ కౌన్సిల్కు కేంద్ర జల శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ చైర్మెన్గా ఉంటారు. ఇందులో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సభ్యులుగా ఉంటారు. ఈనెల 25న జరిగే ఈ సమావేశంలో నాలుగు అంశాలు అజెండాగా పెట్టుకున్నారు. వీటిపై చర్చించాలని నిర్ణయం తీసుకకున్నారు.
ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రికి కరోనా రావడంతో సమావేశం వాయిదా వేసినట్లు తెలుస్తోంది. అయితే సమావేశం వాయిదా వేస్తున్నట్లు ఎటువంటి సమాచారం అందలేదు. ఇప్పుడు కౌన్సిల్ మీటింగ్ వాయిదా పడితే వచ్చే నెలలో నిర్వహించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.