భారత్, చైనా సరిహద్దులో చైనా ఎలాంటి చర్యలకు పాల్పడుతుందో మనం చూస్తున్నాం. గత ఆరు నెలలుగా సరిహద్దులో చైనా తీవ్రంగా ఆక్రమణలకు పాల్పడుతోంది. దీన్ని భారత్ తీవ్రంగా ప్రతిఘటిస్తూ వస్తోంది. ఓ సమయంలో భారత్, చైనా మధ్య యుద్ధం జరుగుతుందా అన్న వాతావరణం ఏర్పడింది.
ఇప్పుడు దీపావళి సందర్బంగా ప్రధాని మోదీ సైనికుల మధ్య వేడుకలు చేసుకున్నారు. ఈ సందర్బంగా ఆక్రమణలకు పాల్పడుతూ ఇబ్బందికర వాతావరణం సృష్టిస్తున్న చైనాను ఉద్దేశించి మోదీ వ్యాఖ్యలు చేశారు. వారి వారి ఇళ్లలోకే నేరుగా చొరబడి అనేక మంది ఉగ్రవాదులను, ఉగ్రవాద నేతలను మట్టుబెట్టామని, దేశ ప్రయోజనాల విషయంలో భారత్ రాజీపడదన్న విషయాన్ని ప్రపంచం ఇప్పుడు అర్థం చేసుకుందని వ్యాఖ్యానించారు. దేశానికి ఈ ఖ్యాతి వచ్చిందంటే అది జవాన్ల శౌర్యం వల్ల మాత్రమే వచ్చిందని మోదీ ప్రశంసించారు.
కొత్త కొత్త ఆవిష్కరణతో జవాన్లు తమ చాతుర్యాన్ని, విజ్ఞానాన్ని ప్రదర్శించాలని, యోగాను బాగా సాధన చేయాలని సూచించారు. విస్తరణ వాదం ఓ మానసిక రుగ్మత అన్నారు. ఈ విస్తరణ వాదులతో ప్రపంచంలో సమస్యలు తలెత్తుతున్నాయన్నారు. 18 వ శతాబ్దపు పోకడలు ఇందులో కనిపిస్తున్నాయని… విస్తరణ వాదానికి వ్యతిరేకంగా భారత్ కూడా బలమైన గొంతుకను వినిపిస్తోందన్నారు. కాగా ఇటీవల భారత్, చైనా మధ్య జరిగిన చర్చల్లో కీలక విషయాలు మాట్లాడినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ప్రణాళికా బద్దంగా సరిహద్దులో బలగాల ఉపసంహరణ చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. మరి ఇది జరిగి మామూలు పరిస్థితులు ఎప్పుడు ఏర్పడతాయో అని దేశం మొత్తం ఎదురుచూస్తోంది.