ప్రధానమంత్రి నరేంద్రమోదీ దీపావళి వేడుకలు సైనికుల మధ్యనే చేసుకున్నారు. దీపావళిని సైనికుల మధ్య చేసుకోవడం ప్రధానికి చాలా ఇష్టం. అందుకే ఈ సారి కూడా ఆయన రాజస్థాన్లోని జైసల్మేర్లో పర్యటించారు. సైనికుల మధ్యే దీపావళి పండగను జరుపుకున్నారు.
సరిహద్దుల వెంట దేశం కోసం పనిచేస్తోన్న సైనికులందరి కుటుంబాలకు ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలుపుతూ వారందరికీ శిరస్సు వంచి నమస్కరించారు. ఈ సందర్బంగా మోదీ సైనికులపై ప్రశంసల వర్షం కురిపించారు. హిమాలయ శిఖరాల్లో, ఎడారిలో, దట్టమైన అడువుల్లో, లోతైన సముద్రాల్లో ఎక్కడ ఉన్నా జవాన్లు పోరాడి విజయం సాధిస్తున్నారన్నారు. దేశం సురక్షితంగా ఉందంటే సరిహద్దుల్లో రక్షణగా ఉన్న సైనికుల వల్లేనని, తీవ్రవాదంతో, ఉగ్రవాదంతో, దేశ ద్రోహులతో జవాన్లు పోరాడుతూ… దేశానికి రక్షణ కల్పిస్తున్నారని ఆయన ప్రశంసించారు.
ఇతర దేశాలను అర్థం చేసుకోడానికే భారత్ మొదట ప్రాధాన్యం ఇస్తుందని, ఆ సమయంలో ఇతర దేశాలు కూడా భారత్ను అదే రీతిలో అర్థం చేసుకోవాలని హితవు పలికారు. ఈ సిద్ధాంతాన్ని పక్కనబెట్టి, దీనికి వ్యతిరేకంగా ఏ దేశం ప్రవర్తించినా భారత్ వారికి గట్టిగా బుద్ధి చెబుతుందని ప్రధాని మోదీ తీవ్రంగా హెచ్చరించారు. ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన కొత్తల్లో దీపావళి పర్వదినోత్సవాన్ని పురస్కరించుకొని సియాచిన్ ప్రాంతంలో పర్యటించాను. కాగా పాకిస్తాన్ జమ్ముకశ్మీర్లోని నియంత్రణ రేఖ వద్ద కాల్పులకు పాల్పడిన విషయం తెలిసిందే. అనంతరం భారత్ సైతం పాక్కు గట్టి బుద్ది చెప్పింది.