1992లో వచ్చిన ‘రోజా’ చిత్రం ఎంతటి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టెర్రరిజం, ప్రేమ కాన్సెప్ట్ ను జత చేసి మణిరత్నం తీసిన ఈ దృశ్యకావ్యం బాక్సాఫీస్ వద్ద అప్పట్లో ఓ సంచలనం. ఇక ఈ సినిమా విజయానికి ప్రధాన కారణాల్లో చిత్రంలో నటించిన అరవింద్ స్వామి, మధుబాల నటన కూడా ఒకటిగా చెప్పొచ్చు. ఇప్పుడు మళ్లీ 28 ఏళ్ల తర్వాత ఈ జంట కలిసి నటించనుంది.
జయలలిత జీవిత కథ ఆధారంగా ‘తలైవి’ అనే సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఏఎల్ విజయ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో జయలలిత పాత్రలో కంగనా రనౌత్ నటిస్తుండగా కరుణానిధి పాత్రలో ప్రకాష్ రాజ్ నటిస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో మరో ప్రముఖ పాత్ర ఎం.జి.రామచంద్రన్ పాత్రలో అరవిందస్వామి నటిస్తున్నాడు. ఇక ఇదిలా ఉంటే తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రంలో ఎం.జి. రామచంద్రన్ భార్య జానకి రామచంద్రన్ పాత్రలో అలనాటి అందాల తార మధుబాల నటించనుందని తెలుస్తోంది. ఈ విషయమై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ చిత్రానికి బాహుబలి రచయిత విజయేంద్రప్రసాద్ కథను పర్యవేక్షిస్తుండడం విశేషం. తెలుగు, తమిళంతో పాటు హిందీలోనూ ఏక కాలంలో విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది.