ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా బాపట్ల ఎంపీ నందిగం సురేష్పై దాడి చేశారు. ఎంపీపై ఒక్కసారిగా దాడికి ప్రయత్నించగానే గన్మెన్లు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత దాడి చేసిన వారిని పట్టుకున్నారు. దీనిపై విచారణ చేస్తున్నారు
గురువారం రాత్రి 10.30 గంటల సమయంలో ఈ దాడి జరిగింది. ఉద్దండరాయునిపాలెంలోని తన ఇంటివద్ద నుంచి బయటకు వెళ్లేందుకు ఎంపీ కారులో బయల్దేరారు. దీంతో ఎదురుగా వచ్చిన వ్యక్తి తన బైక్ను అడ్డుపెట్టి అసభ్య పదజాలంతో దూషించినట్లు తెలుస్తోంది. అయితే ఎందుకు అడ్డు తగిలారో అని తెలుసుకునే లోపే దాడి చేసేందుకు ముందుకు వచ్చినట్లు చెబుతున్నారు. దీంతో వెంటనే అక్కడున్న గన్మెన్లు అడ్డుకున్నారు.
కాగా దాడి చేసిన వ్యక్తి తుళ్లూరు మండలం మందడం గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త బత్తుల పూర్ణచంద్రరావు అని తెలుస్తోంది. ముందుగా అనుకొనే ఈ దాడి చేశారా అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇతన్ని పోలీసులకు అప్పగించారు. దాడి ఎందుకు చేశారన్నది తెలియాల్సి ఉంది. ఎవరైనా ఉద్దేశపూర్వకంగానే దాడి చేయించారా అన్న విషయాలు వెలుగులోకి రావాలి. కాగా ఇటీవల ఏపీలో తెలుగుదేశం పార్టీ నేతలు, వారికి సంబంధించిన వాహనాలపై దాడులు జరిగిన విషయం తెలిసిందే. ఈ విషయం రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేగింది. కాగా ఇప్పుడు వైసీపీ ఎంపీ పైనే దాడి జరిగింది.