ఆంధ్రప్రదేశ్లో విద్యా వ్యవస్థలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో స్కూల్ అటెండెన్స్ రిజిస్టర్పై కీలక సర్క్యులర్ జారీ అయ్యింది. విద్యార్థుల అటెండెన్స్ రిజిస్టర్లో కుల, మత వివరాలు నమోదు చేయకూడదని స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఈ నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది.
స్కూల్స్లో అటెండెన్స్ రిజిస్టర్లో విద్యార్థుల కులం, మతం ప్రస్తావించకూడదని సీఎం జగన్ నిర్ణయించిన విషయం తెలిసిందే. దీంతో దీనిపై తాజాగా ఉత్తర్వులు వెలువడ్డాయి. కొన్ని స్కూల్స్లో విద్యార్థుల కుల, మత వివరాలను హాజరులో నమోదు చేస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో స్కూల్ ఎడ్యుకేషన్ డైరక్టర్ వెంటనే స్పందించి వాటిని తొలగించాలని సర్కులర్ ఇచ్చింది. ఇక దీనిపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించారు. జగన్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఆయన కొనియాడారు.
కుల, మత భేదాలు లేని సమాజానికి తొలి అడుగు వేసిన సీఎం జగన్ అన్నారు. ఇలాంటి ఆదేశాలు జారీ చేసిన మొట్టమొదటి రాష్ట్రం ఏపీ అవుతుందన్నారు. మహాత్ములు కలలు కన్న కులమత రహిత సమాజానికి ఇది నాంది అన్నారు. ముఖ్యమంత్రి జగన్ దూరదృష్టికి సలాం అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. కాగా జగన్ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల పబ్లిక్ నుంచి కూడా మంచి స్పందన వస్తోంది. విద్యార్థులు చదువుకునే సమయంలో కులం, మతం ప్రస్తావన అవసరం లేదని పలువురు చెబుతున్నారు. మంచి నిర్ణయాన్ని జగన్ తీసుకున్నారని అంటున్నారు.