దేశ రాజధాని ఢిల్లీలో రైతులు ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ వీరు ఆందోళన చేస్తూనే ఉన్నారు. కేంద్రం రైతులతో ఇప్పటికే పలు మార్లు చర్చలు జరిపినా ఫలితం లేకపోయింది. కొత్త చట్టాలను రద్దు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
ఢిల్లీ సరిహద్దులో ఒకటైన సింఘూ సరిహద్దులో నిరసన చేస్తున్న రైతులకు వైఫై సౌకర్యం కల్పించనున్నట్లు ఆమ్ ఆద్మీ పార్టీ తెలిపింది. నిరసనకారుల నుంచి వచ్చిన డిమాండ్కు అనుగుణంగా అవసరమైనన్ని వైఫై హాట్స్పాట్లు ఏర్పాటు చేయనున్నట్లు ఆప్ పేర్కొంది. సింఘూ సరిహద్దులోని వివిధ ప్రాంతాల్లో 100 మీటర్ల దూరం చొప్పున వైఫై హాట్స్పాట్లను ఏర్పాటు చేయనున్నారట.
నిరసన చేస్తున్న రైతులు తమ కుటుంబ సభ్యులతో టచ్లో ఉండాలని మేం కోరుకుంటున్నాం. అందుకోసం సింఘూ సరిహద్దులో కొన్ని ప్రాంతాలను గుర్తించి వాటిని వైఫై హాట్స్పాట్లుగా మార్చబోతున్నాం. ఇది ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఆమ్ ఆద్మీ పార్టీ చొరవ. ఆందోళనకారుల నుంచి డిమాండ్ పెరిగితే మరిన్ని వైఫై హాట్స్పాట్లు ఏర్పాటు చేస్తామని ఆమ్ ఆద్మీ పార్టీ చెబుతోంది. కేజ్రీవాల్ ముందు నుంచీ రైతులకు మద్దతు ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలను అరవింద్ కేజ్రీవాల్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ చట్టాలకు సంబంధించిన ప్రతుల్ని మొన్నామధ్య ఢిల్లీ అసెంబ్లీలో చించేసి వీటిని ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.