దేశంలో కరోనా స్ట్రెయిన్ భయం కొనసాగుతూనే ఉంది. మొన్నటి వరకు కేవలం కరోనాతోనే ప్రజలు భయపడుతుంటే ఇప్పుడు స్ట్రెయిన్ భయం కూడా తోడైంది. ఇప్పుడిప్పుడే దేశంలో కరోనా స్ట్రెయిన్ కేసులు పెరుగుతున్నాయి. దేశ వ్యాప్తంగా మొత్తం 20 కరోనా స్ట్రెయిన్ కేసులు నమోదయ్యాయి.
దేశంలో నిన్న 6 కరోనా స్ట్రెయిన్ కేసులు నమోదైనట్లు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. నేడు మరో 14 కేసులు వచ్చినట్లు చెప్పింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 20కి చేరుకుంది. వీరి నుంచి ఎవరికి ఈ వ్యాధి సోకిందన్న దానిపై అధికారులు పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటున్నారు. స్ట్రెయిన్ బారిన పడిన వారికి అక్కడే ఐసోలేషన్ వార్డుల్లో పెట్టి చికిత్స అందిస్తున్నారు.
వీళ్లతో ఎవరు సన్నిహితంగా ఉన్నారన్న దానిపై అధికారులు ఆరా తీస్తున్నారు. అలాంటి వారిని గుర్తించి వెంటనే క్వారంటైన్ పంపేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్నాటక, తమిళనాడు రాష్ట్రాలలో కేసులు వచ్చాయి. దీంతో అక్కడి ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉన్నాయి. దేశ వ్యాప్తంగా కొత్త వైరస్ను కనిపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయోగశాలలు ఏర్పాటు చేసింది. భారత్ నుంచి ఇతర దేశాలకు నిలిచిపోయిన విమాన సేవలు ఇంకొన్నాళ్లు నిలిచి పోయే అవకాశాలు ఉన్నాయని ప్రభుత్వ వర్గాల ద్వారా తెలుస్తోంది.