ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏదైనా మాట్లాడింది అంటే అది ప్రపంచం మొత్తం తెలిసిపోతుంది. ఎందుకంటే అంతర్జాతీయ స్థాయిలోనే డబ్ల్యూహెచ్ఓ వ్యాఖ్యలు చేస్తుంది. ఇప్పుడు తాజాగా నరేంద్ర మోదీపై పొగడ్తలు కురిపిస్తోంది ఈ సంస్థ.
ఇండియా కరోనా పోరును సమర్థవంతంగా ఎదుర్కొంటోందని డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అథనోమ్ అన్నారు. నరేంద్ర మోదీ నిబద్దతకు ధన్యవాదాలన్నారు. కరోనా విజృంభణ సమయంలో భారత ఔషధ పరిశ్రమ 150 దేశాలకు అత్యవసర మందులు పంపిణీ చేసిన విషయాన్ని ఆయన చెప్పారు. కరోనాను ఎదుర్కొనేందుకు భారత్ వ్యాక్సిన్ ఉత్పత్తి, సరఫరా సామర్థ్యాన్ని ఉపయోగించుకుంటుందని తెలిపారు.
భారత్లో కరోనా వ్యాక్సిన్ ప్రయోగాలు మూడో దశకు చేరుకున్నాయన్నారు. వ్యాక్సిన్ ఉత్పత్తిలో అగ్రగామిగా ఉన్న భారత్ ప్రపంచ దేశాలకు సహాయ పడుతుందని మోదీ చెప్పిన మాటకు స్పందిస్తూ మాట్లాడిన ఆయన ప్రపంచ శ్రేయస్సు కోసం మనదగ్గరున్న శక్తులను, వనరులను కలిసికట్టుగా సమీకరించడం ద్వారానే కరోనాను ఎదుర్కోగలమన్నారు. మొత్తానికి ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో భారత ప్రధాని గురించి చర్చకు రావడం మామూలు విషయం కాదు. కరోనాను ఎదుర్కోవడమే కాకుండా ఇతర దేశాల పట్ల స్నేహపూర్వక వైఖరితో మెలగడంతోనే ఇది సాధ్యమైందని మేధావులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.