దేశం మరో జాతీయ నాయకుడిని కోల్పోయింది. కేంద్ర మాజీ మంత్రి జశ్వంత్ సింగ్ ఆదివారం కన్నుమూశారు. గత కొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆర్మీ ఆస్పత్రిలో తుది శ్వాస విడిచారు. దీంతో బీజేపీ నేతల్లో విషాదం నెలకొంది.
జశ్వంత్ సింగ్ 1938 జనవరి 3వ తేదీన రాజస్థాన్లోని జసోల్లో జన్మించారు. ఈయన సైన్యంలో చేరి వివిధ హోదాల్లో పనిచేశారు. రిటైర్డ్ అయిన అనంతరం ఆయన బీజేపీలో చేరి 34 సంవత్సరాల పాటు పార్లమెంటు సభ్యుడిగా ఉన్నారు. వాజ్పేయి హయాంలో రక్షణ శాఖ మంత్రిగా, ఆర్థిక, విదేశాంగ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఈయన ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా కూడా పనిచేశారు.
అనారోగ్య కారణాలతో జూన్ 25వ తేదీన ఆయన ఢిల్లీలోని ఆర్మీ ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నారు. గుండెపోటు రావడంతో ఆయన ప్రాణాలు విడిచారు. ఈయన మరణవార్త తెలియగానే బీజేపీ శ్రేణులు విషాదంలో మునిగిపోయాయి. ప్రధాని మోదీ దిగ్బ్రాంతికి గురయ్యారు.