కరోనా సాకు చూపి ఎంతో మంది మోసం చేసే పనిలో పడ్డారు. ఇప్పటికే పలువురు నకిలీ మందుల పేరుతో దోపిడీ చేస్తుండగా.. కొందరు మాత్రం పట్టుబడుతున్నారు. తాజాగా ఓడిశాలో కరోనాకు మందు ఇస్తామని చెబుతూ అమాయకులైన ప్రజలను మోసం చేస్తున్న వారిని పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు.
ఒడిశాలోని బరగఢ్ జిల్లా బెడన్ సమితి రుసుడా గ్రామంలో కరోనాకు మందులు ఇస్తున్నారన్న ప్రచారం జోరుగా సాగింది. చుట్టుప్రక్కల వారంతా దీని గురించి డిస్కస్ చేసుకోవడంతో విషయం పోలీసుల దాకా వెళ్లింది. దీంతో పోలీసులు కాపు కాచి కరోనాకు నకిలీ మందులు అమ్ముతున్న ప్రహ్లాద్ అనే వ్యక్తిని పట్టుకున్నారు. పోలీసుల దాడుల్లో సంచలన విషయాలు బయటకు వచ్చాయి. ప్రహ్లాద్ అనే వ్యక్తి అస్సలు ఆర్.ఎంపీ కూడా కాదని తెలిసింది. కేవలం ప్రజలను మభ్యపెడుతూ నకిలీ ఔషదాలు అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నాడు ఇతను.
పోలీసులు ఇతన్ని అరెస్టు చేశారు. అక్కడున్న మందులను స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈయన ఇస్తున్న మందులు ఏ రోగానికి పని చేస్తాయో పరీక్షలు చేసిన అనంతరం చెబుతామని డ్రగ్ ఇన్స్పెక్టర్ తెలిపారు. అయితే కోవిడ్ వ్యాక్సిన్ వచ్చిందంటూ చుట్టు ప్రక్కల గ్రామాల్లో పెద్ద ఎత్తున ప్రచారం జరగింది. ఎంతో మంది అమాయకులు కరోనా అంటేనే భయపడిపోతున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రజల వద్ద నుంచి వేలకు వేల డబ్బులు తీసుకోవచ్చన దురుద్దేశంతోనే ఇలాంటి పనులు చేస్తున్నారని పోలీసులు తెలిపారు. ఇప్పటికైనా అమాయకులు మోసపోవద్దని చెబుతున్నారు.