భారతీయ జనతా పార్టీ నూతన కార్యవర్గం రూపు పట్ల సర్వత్రా ఆసక్తి నెలకొంది. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ముఖ్యపాత్ర పోషించే నేతలను పార్టీ ఎంపిక చేస్తుందన్న ఊహాగానాల నేపథ్యంలో దానికి తగ్గకుండానే జాతీయ కార్యవర్గంలో చోటు దక్కింది. ఏపీ నుంచి పురంధేశ్వరి, తెలంగాణ నుంచి డీ.కే అరుణలకు అవకాశం కల్పించింది బీజేపీ.
బీజేపీ జాతీయ కార్యవర్గంలోకి ఏపీ నుంచి పురంధేశ్వరిని తీసుకుంటూ ఆమెకు జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి ఇచ్చారు. తెలంగాణ నుంచి బలమైన నాయకురాలు డీ.కే అరుణకు జాతీయ ఉపాధ్యక్ష్య పదవి ఇచ్చారు. ఏపీకి చెందిన మరో నేత సత్యకుమార్కు జాతీయ కార్యదర్శిగా అవకాశం కల్పించారు.
అయితే బీజేపీ తెలుగు రాష్ట్రాలలో బలపడేందుకు అన్ని సమీకరణాలు పరిశీలించి వీరికి జాతీయ కార్యవర్గంలోకి తీసుకొని ఉంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఏపీలో బలపడాలని చూస్తున్న ఆ పార్టీ ఇప్పటికే జనసేన పార్టీతో కలిసి పనిచేస్తామని చెప్పింది. తాజాగా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడుగా సోము వీర్రాజును నియమించింది. ఇప్పుడు కీలక కమ్మ సామాజిక వర్గానికి చెందిన నాయకురాలైన పురంధేశ్వరికి జాతీయ ప్రధాన కార్యదర్శిగా తీసుకుంది. దీంతో పార్టీ బలోపేతం అవుతుందన్న నమ్మకంతో అధిష్టానం ఉంది. ఇప్పటికే కేంద్ర మంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్న ఆమె పార్టీని క్షేత్ర స్థాయి నుంచి బలపరిచేందుకు ముఖ్యభూమిక పోషిస్తుందన్ని అంతా అనుకుంటున్నారు.
ఇక తెలంగానాలో బలమైన నాయకురాలై డీ.కే అరుణ ముందు నుంచీ రాష్ట్ర అధ్యక్ష్య పదవి వస్తుందని అనుకున్నారు. అయితే అనూహ్యంగా ఆమెకు జాతీయ ఉపాధ్యక్ష్య పదవి ఇచ్చారు. అయితే ఈ విషయంలో ఆమె ఎలా రిసీవ్ చేసుకుంటారో తెలియదు కానీ అధిష్టానం మాత్రం అన్నీ ఆలోచించి డీకే అరుణకు ఈ పదవి అప్పజెప్పింది. అధికార పార్టీని ధీటుగా ఎదుర్కొనేందుకు ఆమెకు కీలక పదవి దక్కిందని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. ప్రధానంగా మహిళా నాయకురాళ్లను జాతీయ కార్యవర్గంలోకి తీసుకోవడంతో బీజేపీ చాకచక్యంగా ముందుకు వెళుతుందని అనుకుంటున్నారు.