ఏపీలో టిడిపి మరో వికెట్ కోల్పోయింది. తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత గద్దె బాబూరావు పార్టీకి రాజీనామా చేశారు. ఇప్పటికే పలువురు పార్టీని వీడుతున్న నేపథ్యంలో ఈయన రాజీనామా చేయడంతో ఇక అందరి దృష్టీ టిడిపి వైపే ఉంది.
మొన్న విశాఖ దక్షిణ ఎమ్మెల్యే టిడిపి నుంచి బయటకు వెళ్లిపోయిన విషయం తెలిసిందే. అనంతరం ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ టిడిపిపై మండిపడ్డారు. అభివృద్ధి చేస్తున్న వైసీపీకి వ్యతిరేకంగా ఎలా పోరాడాలని ఆయన టిడిపి అధ్యక్షుడిని ప్రశ్నించారు. అందుకే పార్టీ వీడుతున్నట్లు చెప్పారు. కాగా ఇప్పుడు విజయనగరం జిల్లాకు చెందిన గద్దె బాబూరావు టిడిపికి వీడుతున్నట్లు చెప్పారు.
పార్టీ పట్టించుకోవడం లేదని గద్దె బాబూరావు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీలో ఇక తనకు భవిష్యత్తు లేదనే రాజీనామా చేస్తున్నట్లు చెప్పారు. పార్టీలో పరిస్థితులు బాగోలేవని, సుదీర్ఘ కాలంగా టీడీపీలో పనిచేసినా గుర్తింపు రాలేదని తెలిపారు. ఈయన 1994-99 ఎన్నికల్లో చీపురుపల్లి నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున పోటీ చేసి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఒకసారి ఎమ్మెల్సీగా కూడా గద్దె పనిచేశారు. అయితే ఈయన ఇప్పటికే రెండు సార్లు టీడీపీకి రాజీనామా చేసి తిరిగి మళ్లీ టిడిపిలోనే చేరారు. అయితే ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో ఏ పార్టీలోకి వెళతారో తెలియదు.
ఇప్పటికే పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు టిడిపిని వీడుతున్నారు. మరికొందరు కూడా పార్టీలు మారతారని ప్రచారం జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో సీనియర్ నాయకులు ఇలా తమను పట్టించుకోవడం లేదంటూ టీడీపీని వీడటం ఆ పార్టీకి లోటనే చెప్పాలి.