సంచలనం సృష్టించిన బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం అందరినీ నిర్దోషులుగా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే సుదీర్ఘ పోరాటం చేసిన సీబీఐ ఈ కేసులో ఓడిపోయిందనే చెప్పాలి. సీబీఐ దర్యాప్తులో ఎన్ని ఆధారాలు సేకరించి కోర్టుకు సమర్పించినా చివరకు అవన్నీ ఆరోపణలే అని కోర్టు స్పష్టం చేసింది. మొత్తానికి సీబీఐ ఓడిపోయింది.
బాబ్రీ మసీదు కూల్చివేసిన తర్వాత దేశంలో పరిణామాలు తీవ్రంగా మారిపోయాయి. అప్పట్లో చెలరేగిన అల్లర్లలో 2వేల మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే కరసేవకులను రెచ్చగొట్టి కట్టడం కూల్చివేతకు కారణమయ్యారని బీజేపీ అగ్రనేత ఎల్.కే అడ్వానీతో సహా 49 మందిపై అభియోగాలు నమోదయ్యాయి. దీన్ని దర్యాప్తు చేస్తున్న సీబీఐ 28 ఏళ్లపాటు తమకు అందిన ఆదారాలన్నీ కోర్టుకు సమర్పించింది. ఈ కేసులో సీబీఐ 40వేల మంది ప్రత్యక్ష్య సాక్షుల వాంగ్మూలాలను నమోదు చేసింది. 100కు పైగా ఆడియో వీడియో టేపులు కోర్టుకు అందించింది.
అయితే సీబీఐ సమర్పించిన ఆధారాలపై కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పత్రికల్లో వచ్చిన కొన్ని వార్తల్ని ఆధారంగా చూపించినా ఆ పత్రికల అసలు ప్రతులను ఇవ్వకపోవడంతో ఆ వార్తల్ని పరిగణలోకి తీసుకోవడం లేదని తెలిపింది. కట్టడం కూల్చివేత ఫోటోలు న్యాయస్థానంలో సమర్పించినా వాటి నెగిటివ్లను ఇవ్వకపోవడం వలన వాటిపై ఆధారపడలేమని జడ్జి తేల్చి చెప్పారు. వీడియోల్లో ఉన్న దృశ్యాలు సరిగ్గా కనిపించడకపోవడం, వీడియో క్యాసెట్లను సీల్ చెయ్యకపోవడం వల్ల వీటిని పరిగణలోకి తీసుకోవడం లేదని న్యాయమూర్తి ప్రకటించారు.
ఈ వీడియోలు అసలైనవో కావో అనేందుకు పోరెన్సిక్ నివేదికకైనా పంపించలేదని వ్యాఖ్యలు చేశారు. తమకు చూపించిన కొన్ని వీడియోల్లో ప్రకటనలు కనిపించాయని… దీంతో ఇవి ఎడిట్ చేసినవని చెప్పారు. నిందితుల్లో ఎవరు ఎలా రెచ్చగొట్టారో, ఎలా రెచ్చగొట్టే మాటలు మాట్లడారో ఆరోపణలు చేసిన విదంగా నిరూపించ లేదని.. కేవలం ఆరోపణల ఆధారంగా దోషులుగా చెప్పలేమని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం స్పష్టం చేసింది. కాగా తీర్పు ప్రతిని సీబీఐ ప్రధాన కార్యాలయానికి పంపించారు. దీన్ని పరిశీలించాక హైకోర్టులో సవాల్ చేయాలా వద్దా అన్నదానిపై నిర్ణయం వస్తుందని సీబీఐ సంస్థ తరపు న్యాయవాది లలిత్సింగ్ తెలిపారు. కాగా ఏ కేసులోఐనా సీబీఐ ఆధారాలు పక్కాగా ఉంటాయని చెబుతారు. మరి ఈ కేసులో సీబీఐ సరైన ఆధారాలు సాధించలేకపోవడం పై అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.