ప్రపంచ దేశాల్లో కొన్ని దేశాలు కలిసి ఉంటే మరికొన్ని దేశాలు శత్రుదేశాలుగా ఉంటాయి. ఇప్పుడు భారత్ విషయంలో కూడా పలు దేశాలు ఈ విధంగానే వ్యవహరిస్తున్నాయి. పాకిస్తాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక చైనా గత కొన్ని నెలలుగా సరిహద్దులో చేస్తున్న అలజడి కొత్తేమీ కాదు. దీంతో చైనాతో కలిసి పనిచేస్తున్న దేశాలు భారత్తో పాటు మిత్ర దేశాలపై కన్నెర్ర జేస్తున్నాయి.
చైనా కట్టడి కోసం అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా, భారత్ దేశాల సభ్యత్వంతో ఏర్పాటైన క్వాడ్ కూటమిపై రష్యా విదేశాంగ శాఖ మంత్రి సెర్గీ లావ్రోవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చైనాను నియంత్రించేందుకు పాశ్చాత్య ప్రపంచం దూకుడుగా అనుసరిస్తున్న మోసపూరిత విధానంలో భారత్ ఓ వస్తువుగా మారిందని కామెంట్ చేశారు. అదే సమయంలో..భారత్-రష్యా దేశాల సన్నిహిత దౌత్య సంబంధాలను కూడా బలహీనపరిచేందుకు పాశ్చాత్య ప్రపంచం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. మిలిటరీ వ్యవహారాలకు సంబంధించి సాంకేతిక సమన్వయం విషయంలో భారత్పై అమెరికా తెస్తున్న ఒత్తిడికి కారణం ఇదే ఆయన కామెంట్ చేశారు.
అక్టోబర్లో జరిగిన క్వాడ్ దేశాల విదేశంగ మంత్రుల సమావేశానికి భారత్ తరఫున కేంద్ర మంత్రి ఎస్ జై శంకర్ హాజరయ్యారు. ఆ తరువాత నుంచీ రష్యా వ్యాఖ్యల్లో వాడీ వేడి పెరిగింది. ఇది అనేక ప్రశ్నలకు తావిస్తోంది. అయితే ఈ పరిణామం విషయంలో భారత్ మాత్రం మౌనాన్నే ఆశ్రయించింది. చైనా-రష్యాల మధ్య బలపడుతున్న దౌత్య సంబంధాలే ఈ వైఖరికి కారణమని ఢిల్లీ వర్గాలు భావిస్తున్నట్టు తెలుస్తోంది. అమెరికా వైఖరిపై రష్యాలో పెరుగుతున్న అసంతృప్తిని ప్రతిఫలిస్తూ మంత్రి సెర్గీ అనేక కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా ఆధిపత్యంలో ఏక ధృవ ప్రపంచం పునరుద్ధరణకు పాశ్చాత్య దేశాలు ప్రయత్నిస్తున్నట్టు స్పష్టంగానే కనబుడుతోందని… కానీ..రష్యా, చైనా మాత్రం ఈ ఆధిపత్యానికి తలొగ్గవన్నారు. మొత్తానికి భారత్ను టార్గెట్ చేసేందుకు ఎవరు ఎన్ని ప్రణాళికలు రచించినా భారత్ ఏదో ఒక రోజు గట్టిగానే సమాధానం చెబుతుందని అందరూ అనుకుంటున్నారు