ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర హైకోర్టు ఇస్తున్న తీర్పులు సామాన్యుల నుంచి మొదలుకొని అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తూ ప్రశ్నలు తలెత్తేలా చేస్తున్నాయి. ప్రజాస్వామ్యంలో మూడు వ్యవస్థలు కీలకమన్నది మనకు తెలిసిందే. రాజ్యాంగంలో శాసనం, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థలకు సమానమైన పరిధి ఉంటుంది. అయితే తాజాగా చోటుచేసుకుంటున్న పలు పరిణామాలు న్యాయవ్యవస్థను ప్రశ్నించేలా చేస్తున్నాయి. ఏపీ మాజీ ఏజీ, సుప్రీంకోర్టు న్యాయమూర్తి కుమార్తెలు నిందితులుగా ఉన్న ఓ కేసు విషయంలో హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది.
ఈ ఆదేశాలతో దేశ మంతా చర్చ జరుగుతోంది. ప్రధానంగా ఎఫ్.ఐ.ఆర్ వివరాలు వెల్లడించకూడదని చెప్పడంపై మీడియా దిగ్గజాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సామాన్యులెవరైనా ఉంటే ఇలాగే చేసే వారా.. మరెందుకీ ఆంక్షలు అని ప్రశ్నించుకుంటున్నారు. తాజా తీర్పు ఆర్టికల్ 19కి, సమాచార హక్కు చట్టానికి పూర్తిగా విరుద్ధమని చెబుతున్నారు. ప్రముఖుల పేర్లు ఎఫ్.ఐ.ఆర్లో నమోదైతే ప్రస్తావించకూడదా అన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి ఆదేశాలు రావడం దేశంలోనే మొదటిసారని మీడియా సంస్థలు, న్యాయ నిపుణులు చెబుతున్నారు.
ఎమర్జెన్సీ సమయాల్లో కూడా మీడియాను ఈ స్థాయిలో నియంత్రించలేదన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఈ ధోరణి సరైంది కాదని చెబుతున్నారు. ఈ పరిణామాలు ఎక్కడకు దారి తీస్తాయోనన్న ఆందోళన పలువురు వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. సిట్, మంత్రి వర్గ ఉపసంఘం ఆధారంగా దర్యాప్తుని వద్దంటున్న వైఖరిని ఆయన తప్పుబట్టారు. సీబీఐ విచారణకు అంగీకరించాలని పిటిషన్ వేసినా తోసిపుచ్చారన్నారు. మరి ఈ విషయంలో ఏం జరుగనుందో వేచిచూడాలి.