ఆయన రాజకీయాల్లో సీనియర్ పొలిటీషియన్.. ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రముఖ పాత్ర పోషించిన వ్యక్తి.. అధికారంలో ఉన్నప్పుడు ఆయన ఏం చేసినా ఎవ్వరూ ఏం చేయలేని విధంగా ప్లానింగ్ చేసే ఏకైక వ్యక్తి.. ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది ఆయనెవరని..
చంద్రబాబు నాయుడు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏపీ ముఖ్యమంత్రిగా ఆయన పేరొందిన నేత అయినా.. ఏపీలో మాత్రం అంతకుమించే ఆయనకు గుర్తింపు ఉంది. ఎందుకంటే రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి ఆయన వ్యవహారశైలిపైన ఏపీ ప్రజలకు అవగాణన ఉందని చెప్పొచ్చు. ప్రధానంగా రాష్ట్రం విడిపోయాక తెలంగాణాలో పదేళ్లు ఏపీకి ఉండే అవకాశం ఉన్నా దాన్ని ఏ విధంగా దుర్వినియోం చేశారో ప్రజలకు తెలుసు.
ప్రధానంగా ఓటుకు నోటు కేసులో అడ్డంగా బుక్కయిన చంద్రబాబు నాయుడు చాకచక్యంగా కేసు నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశారు. ఎందుకంటే ఓటుకు నోటు కేసులో ఫోన్లో మాట్లాడింది చంద్రబాబేనని అందరికీ తెలిసిందే. ఆయన మాటలు ఎవరు విన్నా ఇవి కచ్చితంగా చంద్రబాబునవే చెబుతారు. అయితే దేశంలో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసులో చంద్రబాబు తన పాత్రపై ఏమాత్రం తప్పులేదని చెబతారు. పైగా ఓ ముఖ్యమంత్రి ఫోన్ను ఎలా ట్యాప్ చేస్తారని వాదించడం కొత్త అనుమానాలు తెస్తోంది.
సామాన్యులు తప్పు చేస్తే కేసులు పెట్టడం, విచారణలు చేయడం, శిక్షలు వేయడం ఎలా జరుగుతాయో మనకు తెలసిందే. అయితే చంద్రబాబు అండ్ కో కేసుల్లో మాత్రం ఇది జరగదు. పొరపాటున కేసు నమోదు చేస్తే విచారణ జరగనివ్వరు.. ఒక వేళ విచారణ జరిగినా వెంటనే స్టేలు తెచ్చుకోవడం, కేసు దర్యాప్తును ఆపుకోవడం ఇదంతా కామన్గా జరుగుతోందని ఆయన, ఆయన పార్టీ నేతలపై జరుగుతున్న కేసులను పరిశీలిస్తున్న వారికి ఇట్టే అర్థమైపోతుంది.
ఒక్క ఓటుకు నోటు కేసులోనే కాదు చాలా కేసుల్లో చంద్రబాబు ఈజీగా బయట పడుతుండటం ఇప్పుడు సగటు సామాన్యుడిని ఆందోళన కలిగిస్తోన్న అంశం. ఇందుకు బలం చేకూరుస్తూ చాలా కేసులే ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఇటీవల ఉత్కంఠగా సాగిన ఈఎస్ఐ స్కాంలో టిడిపి నేత మాజీ మంత్రి అచ్చెన్నాయుడు ఇరుక్కోవడం మనకు తెలిసిందే. కోట్ల రూపాయల ఆరోపణలు ఎదుర్కొన్న ఆయన ఇటీవలె బెయిల్పై విడుదలయ్యారు కూడా. అయితే ఆయన్ను పోలీసులు అరెస్టు చేయగానే వెంటనే బెయిల్ తెచ్చుకోవడానికి ఏ విధంగా కృషి చేశారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇందులో భాగంగానే ఆయనకు జరిగిన సర్జరీ కారణంగా చాలా రోజులు హాస్పిటల్లోనే గడిపారు. చివరకు బెయిల్ తెచ్చుకున్నారు. అయితే సామాన్యులు ఎవరైనా ఇంతలా పోరాడి బెయిల్ తెచ్చుకోగలరా.. ఇది చంద్రబాబు టీంకు మాత్రమే సాధ్యమా అంటే సమాధానం మనం చెప్పలేం.
ఇక అమరావతి భూ కుంభకోణం గురించి ఎంత చెప్పినా తక్కువే. అమరావతి రాజధాని వ్యవహారంలో ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగిందని వచ్చిన ఆరోపణలు నిరూపించడానికి ప్రభుత్వం సిట్ను ఏర్పాటు చేసింది. చంద్రబాబు అధికారంలో ఉండగా వేల ఎకరాల భూముల విషయంలో అవినీతి అక్రమాలు జరిగాయన్నది ఆరోపణ. ఈ విషయంలో విచారణ జరిగేందుకు ప్రభుత్వం ముందుకు వెళితే రాష్ట్ర హైకోర్టు మాత్రం స్టే ఇచ్చింది. ఈ విషయంలో వివరాలు బహర్గతం చెయ్యొద్దని చెప్పింది. దీంతో మరోసారి చంద్రబాబు మార్క్ ఇక్కడ కనిపిస్తోందని పలువురు మేధావులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
అమరావతి కుంభకోణంలో ప్రధానంగా న్యాయవాదులు, ప్రముఖ జడ్జిల కూతుర్లు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయం కేవలం భూముల కుంభకోణంగానే పరిగణించకుండా కొంచెం లోతుగా ఆలోచించాల్సిన అవసరం ఉందని మేధావులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు కోర్టులను మేనేజ్ చేస్తారన్న వాదన ఎప్పటి నుంచో ఉంది. ఈ నేపథ్యంలో ఆయన లబ్ది పొందేందుకు పక్కా ప్లానింగ్తోనే ఇలా న్యాయవాదులు, తదితరులకు సంబంధించిన వారికి భూములు కట్టబెట్టారన్న వాదన కూడా ఉంది. అమరావతి కుంభకోణం వెలుగులోకి రావడంతోనే ఈ తరహా సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
ఇవే కాకుండా విజయవాడలో రమేష్ హాస్పిటల్స్ కు సంబంధించిన కోవిడ్ కేర్ సెంటర్లో అగ్నిప్రమాదం జరిగి పది మంది చనిపోయిన కేసులో హైకోర్టు ఆ హాస్పిటల్ యజమానిని అరెస్టు చెయ్యకుండా ఆపింది. ఈ విషయంలో కూదా డాక్టర్ రమేష్ టిడిపికి చాలా కావాల్సిన వ్యక్తి అని చెబుతున్నారు. ఇక మొన్న తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గానికి చెందిన టిడిపి నేత పరుపుల రాజా కేసులో కూడా హైకోర్టు స్టే ఇచ్చింది. తాజాగా ఏపీ హైకోర్టు తీర్పులపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మేధావులు, జర్నలిస్టులు ఏం మాట్లాడలేని విధంగా హైకోర్టు తీర్పులు ఇస్తోందని చెబుతున్నారు. చంద్రబాబు నాయుడు విషయంలో మాత్రం సపరేట్ తీర్పులు వస్తున్నాయా అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మామూలు కేసుల్లో తీర్పులు ఒకలా ఉంటే.. చంద్రబాబు నాయుడు కేసుల్లో మాత్రం తీర్పులు దాదాపు ఆయనకు అనుకూలంగా ఉంటాయన్నసందేహాలు ప్రజల నుంచే వినిపిస్తున్నాయి. మరి నిజంగా చంద్రబాబు విషయంలో సపరేట్ తీర్పులేమైనా ఉంటే ఇది నిజంగా ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు అవుతుంది.