బలాన్ని అంచనా వేయటం రాజకీయాల్లో అత్యంత కీలకం. అదేం సిత్రమో కానీ.. బేసిగ్గా ఉండాల్సిన ఈ లక్షణం ఏపీకి చెందిన తమ వాళ్లలో లోపించటంపై బీజేపీ అధినాయకత్వం చాలా సీరియస్ గా ఉంది. దక్షిణాదిన పార్టీని బలోపేతం చేయటం ఒక ఎత్తు అయితే.. మిత్రులతో ఉన్న పొత్తును దెబ్బ తీసే చర్యలు ఏ మాత్రం సరికావన్నది బీజేపీ పెద్దల ఆలోచనగా చెబుతున్నారు. బాబును కాదంటే.. ఏపీలో ఇప్పుడున్న పరిస్థితి కంటే దారుణంగా తయారవుతుందన్నది బీజేపీ అధినాయకత్వం ఆలోచనగా తెలుస్తోంది. ఈ కారణంతోనే.. ఇటీవల ఏపీని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పర్యటించిన సందర్భంలో టీడీపీతో తెగతెంపులు చేసుకోవాలంటూ ఉత్సాహాన్ని ప్రదర్శించిన వారిపై ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్ఓతంది.
అమిత్ షా హాజరైన బహిరంగ సభలో బాబుతో కటీఫ్ చెప్పాలంటూ ఫ్లకార్డులు పట్టుకున్న వారి తీరును తీవ్రంగా తప్పు పడుతున్నట్లు తెలుస్తోంది. ఈ తీరు ఏ మాత్రం సరికాదని తేల్చి చెప్పటమే కాదు.. ఇలాంటివి పార్టీకి మంచివి కావని.. ప్లకార్డులు పట్టుకున్న వారికి ఇప్పటికే క్లాస్ పీకినట్లుగా తెలుస్తోంది. ప్లకార్డులు పట్టుకున్న వారికి తలంటంతో వదిలేయకుండా.. అలాంటి వారి వెనుక ఉన్న పెద్ద తలకాయలు ఎవరన్నది తేల్చేందుకు ప్రయత్నాలు షురూ చేసినట్లుగా చెబుతున్నారు.
ఇందుకు సంబంధించిన వారిపై చర్యలు తీసుకోవటానికి సైతం సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే అమిత్ షా బహిరంగ సభకు సంబంధించిన వీడియో క్లిప్పింగ్లను తెప్పించుకున్న అధినాయకత్వం.. ప్లకార్డులు పట్టుకున్న వారిని గుర్తించినట్లుగా చెబుతున్నారు. ప్లకార్డుల సూత్రధారుల్ని గుర్తించటమే మిగిలి ఉందంటున్నారు. నో టీడీపీ.. సేవ్ బీజేపీ అంటూ ప్లకార్డులు ప్రదర్శించటంపై బీజేపీ అగ్రనాయకత్వం సీరియస్ గాఉందంటున్నారు. వ్యూహాత్మకంగా కూడా ఏపీలో టీడీపీతో పొత్తు లాభాన్ని చేకూరుస్తుందని.. అలాంటి విషయాల్ని కూడా గుర్తించని ఏపీ నేతలపై కమలనాథులు కోపంగా ఉన్నట్లుగా తెలుస్తోంది.