విజయవాడ హోటల్ స్వర్ణప్యాలెస్ లో జరిగిన ప్రమాదంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. నిబంధనలు పాటించకపోవడంతోనే ఇలా జరిగిందని స్పష్టమవుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని ఇతర కోవిడ్ కేర్ సెంటర్లపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఏపీలో ప్రతి రోజూ కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ప్రైవేటు హాస్పిటల్స్కి కరోనా కోవిడ్ కేర్ సెంటర్స్గా ఏర్పాటుచేసుకోవచ్చని అనుమతులు ఇచ్చింది. అయితే ఇదే అదునుగా భావించిన పలు ప్రైవేటు ఆసుపత్రి యాజమాన్యాలు ఆదాయం కోసం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి.
స్వర్ణప్యాలెస్ హోటల్ అగ్నిప్రమాదంలో పది మంది మృతిచెందిన విషయం తెలిసిందే. అయితే ఈ హోటల్లో కనీస జాగ్రత్తలు పాటించలేదు. అసలు ఆసుపత్రిలో దట్టమైన పొగలు అలుముకున్న సమయంలో బయటకు వెళ్లేందుకు కూడా దిక్కుతోచని పరిస్థితి నెలకొంది. ప్రమాదంలో పది మంది చనిపోతే అందులో తొమ్మిది మంది దట్టమైన పొగ పీల్చడం వల్లే చనిపోయారు.
ఆ సమయంలో హోటల్లో రెండో ద్వారం ఉండి ఉంటే చనిపోయే వారు కాదు. ఇలా స్వర్ణప్యాలెస్ ఒక్కటే కాదు ఇలాంటి ఎన్నో హాస్పిటల్స్ కోవిడ్ కేర్ సెంటర్స్ నిర్వహిస్తున్నాయి. మరి వీటిలో ఏ విధమైన జాగ్రత్తలు తీసుకున్నారో తెలియాల్సి ఉంది. ప్రస్తుతం కరోనా కేసులు పెరుగుతున్న తరుణంలో ప్రతి ఒక్కరూ కోవిడ్ కేర్ సెంటర్లని ఆశ్రయిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికైనా అధికారులు పూర్తి స్థాయిలో తనిఖీలు చేసి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని పబ్లిక్ కోరుతున్నారు.