దేశంలో రాజకీయ పార్టీల పేరు చెబితే మొదటి వరుసలో వినబడే పేరు కాంగ్రెస్ అనడంలో అతిశయోక్తిలేదు. ఎందుకంటే ఆ పార్టీ దేశ రాజకీయాల్లో అంతలా ముద్రవేసింది. కానీ ఇప్పుడు అదే పార్టీ తన మనుగడను కోల్పోయే పరిస్థితికి వచ్చింది.
2014, 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వరుస ఓటములు చూసింది. భారతీయ జనతా పార్టీ అఖండ మెజార్టీతో గెలిచి కాంగ్రెస్ అడ్రస్సు గల్లంతయ్యేలా చేసింది. దీంతో ఈ దెబ్బ కాంగ్రెస్ అదిష్టానానికి గట్టిగానే తగిలిందని చెప్పాలి. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న రాహుల్ గాంధీ తన పదవికి రాజీనామా చేశారు.
అయితే తాత్కాలిక అధ్యక్ష్య పదవిని సోనియాగాంధీ చేపట్టారు. ఆమె అనారోగ్య కారణాల రిత్యా ప్రతిపక్ష పాత్ర అనుకున్నంత మేర పోషించలేకపోతున్నారన్న చర్చ నడుస్తోంది. సోనియా తాత్కాలిక అధ్యక్ష్య బాధ్యతల్లో కొనసాగుతూ నేటికి ఏడాది అవుతున్న సందర్బంలో ఈ సారైనా పూర్తి స్థాయిలో కొత్త అధ్యక్షుడిని ఎన్నుకుంటారని పార్టీ వర్గాలు ఆశతో ఎదురుచూస్తున్నాయి. అయితే అన్ని రాష్ట్రాల్లో ఉన్న నాయకులను నడిపించాల్సిన బాధ్యత పార్టీ అధ్యక్షుడిపైనే ఉంటుంది. ఆయన డైరెక్షన్లోనే దేశంలోని అన్ని రాష్ట్రాల అధ్యక్షులు నడుచుకుంటూ పార్టీ విధానాలు, పోరాటాలు ప్రజల్లోకి తీసుకెళుతూ ఉంటారు.
ఇప్పుడు ఈ పదవికి మళ్లీ రాహుల్ గాంధీయే సరైన నాయకుడని పలువురు కోరుతున్నారు. అయితే ఆయన మాత్రం దీన్ని నిర్వహించేందుకు సిద్ధంగా లేరని తెలుస్తోంది. కాబట్టి మరెవరినైనా అధ్యక్షుడిని చేయాలని పార్టీ వర్గాలు ఆలోచిస్తే వెంటనే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీకి, అధ్యక్ష్య పదవికి ఎన్నికలు నిర్వహించాలని పార్టీ నేతలు కోరుకుంటున్నారు. అయితే అదిష్టానం మాత్రం ఈమేరకు ఆలోచన చేస్తున్నట్లు కనిపించడం లేదు.
ఇక ఇటీవల ప్రముఖ మీడియా సంస్థ ఇండియా టుడే కార్వీ ఇన్సైట్స్ మూడ్ ఆఫ్ ది నేషన్ పేరిట ఓ సర్వే చేపట్టింది. ఇందులో మోడీ అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడిగా, ఆయనే మళ్లీ ప్రధాన మంత్రిగా ఉండాలని 66 శాతం మంది ప్రజలు కోరుకున్నారు. ఈ సర్వేలే రాహుల్ గాంధీకి 8 శాతం మంది మొగ్గుచూపారు. దీన్ని బట్టి చూస్తే రాహుల్ గాంధీలో ఇంకా చాలా మార్పులు రావాల్సిన అవసరం ఉంది.
దేశం మొత్తం ప్రస్తుతం నరేంద్రమోదీ అంటున్న తరుణంలో సుధీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీకి మళ్లీ పూర్వ వైభవం రావాలంటే అంతే స్థాయిలో ప్రతిపక్ష పాత్ర పోషించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ మధ్య రాహుల్ గాంధీ మోడీ ప్రభుత్వం తీసుకుంటున్న పలు నిర్ణయాలపై సోషల్ మీడియా ద్వారా తన గొంతుకను వినిపిస్తున్న విషయం తెలిసిందే.