మాజీ మంత్రి, వైసీపీ నేత పెనుమత్స సాంబశివరాజు కన్నుమూశారు. వైసీపీ అధినేత, సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆయన మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. ఐదు దశాబ్దాలకు పైగా ప్రజాసేవలో ఉంటూ మచ్చలేని నాయకుడిగా, రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయతకు అర్థం చెప్పిన నాయకుడు ఆయన అన్నారు.
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో కురువృద్ధుడిగా అందరూ సాంబశివరాజు గురించి చెప్పుకుంటారు. 25ఏళ్ల వయస్సులోనే రాజకీయ రంగ ప్రవేశం చేసిన ఆయన ఉమ్మడి రాష్ట్రంలో 8 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి రికార్డు సృష్టించారు. అవినీతి మచ్చలేని నాయకుడిగా ఆయన గురించి చెప్పుకుంటారు. 1967లో మొదటి సారి గజపతినగరం నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్గా నిలబడి గెలిచారు. ఆ తర్వాత 35 ఏళ్లు ఆయన పోటీ చేసిన ప్రతి సారి గెలుస్తూనే ఉన్నారు.
తిరుగులేని నాయకుడిగా ఉత్తరాంధ్రలో ఓ వెలుగు వెలిగారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో ఆయన రవాణా, పౌర సరఫరాల శాఖ మంత్రిగా పనిచేశారు. 1994 ఎన్నికల్లో టిడిపి అభ్యర్థిపై ఆయన ఓటమి చెందారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్తో ఆయనకు చెప్పలేని అనుబంధం ఉండేది. వైఎస్సార్ ఆయనకు ఎంతో గౌరవం ఇచ్చేవారని రాజకీయ వర్గాల్లో చెప్పకునేవారు.
రాష్ట్ర రాజకీయాల్లో చరిత్ర తిరగరాస్తూ కాంగ్రెస్ పార్టీ నుంచి వై.ఎస్ జగన్ బయటకు వచ్చి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని స్థాపించిన సమయంలో ఉత్తరాంధ్రలో జగన్కు అండగా నిలిచిన వ్యక్తి సాంబశివరాజు. అంతేకాకుండా నేతలతో పాటు క్షేత్ర స్థాయిలో ప్రజల్లోకి వెళ్లి వైఎస్ జగన్కు అండగా నిలవాలని చెప్పి పార్టీని బలోపేతం చేశారాయన. ఇదంతా వై.ఎస్ జగన్కు బాగా తెలుసు. అందుకే నేడు ఆయన లేరన్న విషయం తెలియగానే జగన్ తీవ్ర దిగ్బ్రాంతికి లోనయ్యారు. ఆయన మృతిప్ల తీవ్ర సంతాపం వ్యక్తంచేసి.. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.