ఆంధ్రప్రదేశ్లో రాజధాని అంశం పూర్తిగా వివాదాస్పదం అయ్యింది. గత ప్రభుత్వం రాజధానిగా అమరావతి ఉండాలని నిర్ణయిస్తే.. ఇప్పుడు కొత్త ప్రభుత్వం మూడు రాజధానులు ఏర్పాటు చేస్తామని చెబుతోంది. అయితే దీన్ని వ్యతిరేకిస్తూ అమరావతి రాజధాని రైతులు ఆందోళనల బాట పట్టారు.
అమరావతిలో రైతులు చేస్తున్న ఆందోళనలు ఉదృతం అవుతున్నాయి. ఇప్పటికే ఏడాది పూర్తి చేసుకున్నా ఇంకా రైతులు ఆందోళనలు విరమించలేదు. రైతుల ఉద్యమానికి రాజకీయ నాయకులతో పాటు పలువురు సెలబ్రెటీలు కూడా మద్దతు తెలుపుతున్నారు. అమరావతి రైతుల స్ఫూర్తిదాయక పోరాటానికి సంవత్సరం పూర్తైన సందర్భంగా టాలీవుడ్ యంగ్ హీరో నారా రోహిత్ సంఘీభావాన్ని ప్రకటించాడు. మూడు రాజధానులకు వ్యతిరేకంగా అమరావతి రైతులు ప్రారంభించిన పోరాటానికి సంవత్సరం పూర్తయింది. ఈ సందర్భంగా నారా రోహిత్ ట్విటర్ ద్వారా స్పందించాడు. కడుపు నింపే రైతన్నలు ఆనాడు రాష్ట్రం కోసం త్యాగం చేసినా అదే పట్టుదల అని, ఇప్పుడు ఆ త్యాగాన్ని అవహేళన చేస్తూ ప్రజారాజధానిని నామరూపాలు లేకుండా చెయ్యాలని చూస్తున్న వారితో పోరాడినా అదే పట్టుదలతో ఉన్నారన్నారు. రైతన్నల స్ఫూర్తిదాయక పోరాటానికి సంవత్సరం పూర్తైన సందర్భంగా తన సంఘీభావం తెలుపుతున్నట్లు చెప్పారు. జై అమరావతి అని రోహిత్ ట్వీట్ చేశాడు.